Musk:ట్విట్టర్ను ఎలాన్ మస్క్ ఏ ముహూర్తాన కొన్నాడో గానీ… అప్పటి నుంచి ఆస్తులు కరిగిపోవడమే కాదు… ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన మొదటి స్థానం కూడా గల్లంతైంది. అయినా ట్విట్టర్ను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడుతున్నాడు… మస్క్. ఓవైపు ట్విట్టర్ కార్యకలాపాలు చూసుకుంటూనే… మరోవైపు తన కీలక కంపెనీలైన టెస్లా, స్పేస్ ఎక్స్ వ్యవహారాలనూ చక్కబెడుతున్నాడు. మూడు కంపెనీల పనులతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న మస్క్… గత 3 నెలలు చాలా కఠినంగా గడిచాయంటున్నాడు. ముఖ్యంగా ట్విట్టర్ను దివాళా ముప్పు నుంచి రక్షించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని ట్వీట్ చేశాడు. ఇలాంటి బాధ మరొకరికి రాకూడదని కోరుకున్న మస్క్… ట్విట్టర్ ముందు ఇంకా ఎన్నో సవాళ్లు ఉన్నాయని, ప్రజల నుంచి వస్తున్న మద్దతు అభినందనీయమని ట్వీట్ చేశాడు. మస్క్ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కుంగిపోకుండా మస్క్ ముందుకు సాగిపోతున్న వైనాన్ని పలువురు నెటిజన్లు అభినందిస్తున్నారు.
గత అక్టోబర్లో మస్క్ 44 బిలియన్ డాలర్ల భారీ మొత్తానికి ట్విటర్ను కొన్నాడు. ఖర్చులు ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతో వేల మంది ఉద్యోగులను తొలగించాడు. దాంతో… చాలా కంపెనీలు ట్విట్టర్కు ప్రకటనలు ఇవ్వడం మానేశాయి. ప్రస్తుతం యాడ్స్ ఆదాయం కూడా దారుణంగా పతనం కావడంతో… ఆఫీస్ భవనాల అద్దెను కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడు… మస్క్. కంపెనీ ఆదాయం పెంచుకోవడం కోసం నానా ప్రయత్నాలూ చేస్తున్నాడు. అందులో భాగంగానే బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ సర్వీసును ప్రారంభించాడు. దీని కోసం ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్ల నుంచి నెలకు కొన్ని డాలర్లు వసూలు చేస్తున్నాడు. అయినా ఆర్థికకంగా ట్విట్టర్ నిలదొక్కుకోకపోవడంతో… సంస్థలోని వస్తువుల్ని వేలంలో తెగనమ్మేశాడు. ఇప్పుడు పేమెంట్ ఫీచర్ను తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. దీనికి సంబంధించిన లైసెన్స్ కోసం కూడా మస్క్ దరఖాస్తు చేశాడని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అయితే ఈ వార్తలపై ట్విట్టర్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
For More Live Updates Follow Us :-