Musk : ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ గొప్ప మనసు చాటుకున్నారు. అయితే అది ఉద్యోగుల విషయంలో మాత్రం కాదు. తనకు ఆదాయం వస్తుందంటే అనుకున్నది ఏదైనా చేసేందుకు వెనుకాడని మస్క్… ఇప్పుడు నెటిజన్ల అభిప్రాయానికి విలువ ఇస్తున్నానన్న ముసుగులో,
ఇప్పటివరకు నిలిపివేసిన ట్విట్టర్ ఖాతాలకు క్షమాభిక్ష పెట్టేశారు. దశల వారీగా అన్ని నిషేధిత ఖాతాలను యాక్టివేట్ చేస్తామని చెప్పారు… మస్క్.
ట్విటర్లో నిలిపివేసిన ఖాతాలకు క్షమాభిక్ష పెట్టాలా? వద్దా? అన్న అంశంపై మస్క్ పోలింగ్ నిర్వహించారు. ఈ పోలింగ్లో 31.6 లక్షల మంది పాల్గొనగా… 72.4 శాతం మంది క్షమాభిక్ష పెట్టాలన్న ప్రతిపాదనకే ఓటేశారు. 27.6 శాతం మంది ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఎక్కువ మంది క్షమాభిక్ష వైపే మొగ్గు చూపడంతో… మస్క్ ఆ ఖాతాలు పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు మాట ప్రకారం వచ్చే వారం నుంచే ఈ క్షమాభిక్ష మొదలవుతుందని… ప్రజల మాటే దేవుడి మాట అంటూ మస్క్ ట్వీట్ చేశారు.
విద్వేషపూరిత పోస్టులు లేదా నకిలీ సమాచారం వ్యాప్తి చేస్తున్నాయన్న కారణాలతో గతంలో పలు ఖాతాలపై ట్విట్టర్ నిషేధం విధించింది. వాటిల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలువురు ప్రముఖుల ఖాతాలు ఉన్నాయి. అయితే మస్క్ ట్విటర్ను చేజిక్కించుకున్న తర్వాత… నిషేధిత ఖాతాలను పునరుద్ధరిస్తాడని జోరుగా ప్రచారం జరిగింది. అంతా అనుకున్నట్లుగానే… ట్రంప్ ఖాతాను పునరుద్ధరించాలా? వద్దా? అన్న అంశంపై మస్క్ ఇటీవలే పోలింగ్ నిర్వహించారు. ఇందులో మెజార్టీ నెటిజన్లు అనుకూలంగా ఓటెయ్యడంతో ట్రంప్ ఖాతాను మళ్లీ యాక్టివేట్ చేశాడు… మస్క్. ఇప్పుడు అన్ని నిషేధిత ఖాతాలకు క్షమాభిక్ష పెట్టాలా? వద్దా? అని ఓటింగ్ నిర్వహించిన మస్క్… మెజార్టీ జనం అనుకూలంగా ఓటేయడంతో… అన్ని నిషేధిత ఖాతాలు పునరుద్ధరించబోతున్నాడు. మరి పునరుద్ధరణ తర్వాత కూడా విద్వేషపూరిత పోస్టులు, నకిలీ సమాచారం వెల్లువెత్తితే… మస్క్ అప్పుడేం చర్యలు తీసుకుంటాడన్న ప్రశ్నలు నెటిజన్ల నుంచి వస్తున్నాయి. మరి మస్క్ వాటికేం సమాధానం చెబుతాడో మరి.