44 బిలియన్ డాలర్లకు కొంటానని చెప్పి… కొన్ని నెలల పాటు పేచీలు పెట్టి… ఎట్టకేలకు ట్విట్టర్ కొన్న ఎలాన్ మస్క్… సంస్థ చేజిక్కినప్పటి నుంచి వేల మంది ఉద్యోగుల్ని తొలగించాడు. ఆ కోతల్ని ఇప్పటికీ ఆపలేదు. ఇప్పుడు ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ మీద పడ్డ మస్క్… ఒకేసారి 4,400 మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపాడు. దివాళా భయంతో ట్విట్టర్ ఖర్చుల్లో భారీగా కోత పెట్టిన మస్క్… జీతాల సొమ్మును కూడా భారీగా మిగుల్చుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు.
ఔట్సోర్సింగ్ విభాగంలో మొత్తం 5,500 మంది కాంట్రాక్టు ఉద్యోగులుండగా… వాళ్లలో 4,400 మందిని ట్విట్టర్ తొలగించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే వారిని ఇంటికి పంపినట్లు చెబుతున్నారు. సంస్థ ఇ-మెయిల్, ఇంటర్నల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్తో యాక్సెస్ కోల్పోయిన తర్వాతే… ఉద్యోగాలు పోయిన సంగతి తెలుసుకున్నారు… తాత్కాలిక ఉద్యోగులు. అమెరికా సహా ఇతర దేశాల్లోని ట్విటర్ ఆఫీసుల్లో ఈ లే ఆఫ్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కంటెంట్ మోడరేషన్, రియల్ ఎస్టేట్, మార్కెటింగ్, ఇంజినీరింగ్ తదితర ఇతర విభాగాల్లోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించారని చెబుతున్నా… ఈ కోతలపై ట్విట్టర్ నుంచి గానీ, ఎలాన్ మస్క్ నుంచి గానీ అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
సాధారణంగా ట్విటర్ సహా సోషల్మీడియా సంస్థలన్నీ… విద్వేష, హానికర కంటెంట్ను కనిపెట్టి ట్రాక్ చేసేందుకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపైనే ఎక్కువగా ఆధారపడుతుంటాయి. ఔట్సోర్సింగ్ విభాగాల ద్వారా ఒప్పంద ప్రాతిపదికన కంటెంట్ మోడరేషన్ కోసం ఉద్యోగులను నియమించుకుంటాయి. ఇదొక్కటే కాదు… ట్విట్టర్లో మార్కెటింగ్, ఇంజినీరింగ్ విభాగాల్లోనూ కాంట్రాక్ట్ ఉద్యోగులున్నారు. ప్రస్తుతం కంటెంట్ మోడరేషన్లోనే ఎక్కువ మందిని తొలగించినట్లు సమాచారం. తెలుస్తోంది. విద్వేష, హానికర కంటెంట్ను ఎప్పటికప్పుడు కనిపెట్టుకుని ఉండే సిబ్బందినే మస్క్ తీసేయడంతో… ట్విటర్లో మళ్లీ విద్వేష వ్యాప్తి పెరిగే అవకాశముందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.