Microsoft : ఐటీ, టెక్నాలజీ రంగంలో ఎప్పటికప్పుడు ఎన్నో కొత్త కంపెనీలు ప్రారంభమవుతున్నాయి. కానీ ఎన్ని కొత్త కంపెనీలు వచ్చినా.. కొన్ని పాత కంపెనీల బ్రాండ్ మాత్రం చెక్కుచెదరడం లేదు. పైగా ఈ రంగంలో ఎవర్గ్రీన్గా నిలిచిపోయిన సంస్థలు.. కొత్త కొత్త ప్రయోగాలను చేస్తూ.. కస్టమర్లతో పాటు ఇతర కంపెనీలను కూడా ఆకర్షించే పనిలో పడ్డాయి. అలాంటి వాటిలో ఒకటి మైక్రోసాఫ్ట్. తాజాగా మైక్రోసాఫ్ట్ నుండి కీలక వ్యక్తి హఠాత్తుగా రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అనంత్ మహేశ్వరి.. తన పదవికి రాజీనామా చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజీనామాతో మైక్రోసాఫ్ట్తో తనకు ఉన్న అనుబంధాన్ని శాశ్వతంగా ముగించేశారు. అనంత్ రాజీనామా విషయాన్ని మైక్రోసాఫ్ట్ స్వయంగా ప్రకటించింది. భారత్లో మైక్రోసాఫ్ట్ అభివృద్ధికి అనంత మహేశ్వరి అందించిన సేవలను గుర్తుచేసుకుంది. భవిష్యత్తులో ఆయన మరింత మెరుగ్గా రాణించాలని, చేపట్టే పనుల్లో విజయవంతం కావాలని మైక్రోసాఫ్ట్ పేర్కొంది.
మైక్రోసాఫ్ట్.. తన టాప్ ఎగ్జిక్యూటివ్ల పొజిషన్లు మార్చుతున్న సమయంలోనే అనంత్ మహేశ్వరి రాజీనామా చేయడంపై పలువురిలో అనుమానాలు మొదలయ్యాయి. మైక్రోసాఫ్టే కావాలని ఈ పని చేయించిందా అంటూ విమర్శించడం కూడా మొదలుపెట్టాయి ఇతర టెక్ సంస్థలు. అయితే వేరే సంస్థలో మంచి కెరీర్ అవకాశం రావడంతో మహేశ్వరి ఈ నిర్ణయం తీసుకున్నారని మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రతినిధి ప్రకటించారు. రాజీనామా సమయంలో అనంత్ మహేశ్వరి సైతం సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.
ఒకవైపు ఈయన రాజీనామా చేస్తున్న క్రమంలోనే ఇంతకు ముందు ఆయన స్థానంలో పనిచేసిన నవ్తేజ్ బాల్ను సీఈఓగా చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అనంత్ మహేశ్వరి తర్వాత ఆయన స్థానంలోకి ఎవరు వస్తారని అప్పుడే అందరిలో ఆసక్తి మొదలయ్యింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇండియా మాజీ హెడ్ పునీత్ చందోక్కు ఈ అవకాశం అందబోతుందని సమాచారం.