Microgrids : గాలి కాలుష్యం పెరగడానికి కార్చిచ్చులు కూడా కారణమవుతున్నాయి. అది కూడా ముఖ్యంగా అమెరికాలో. వాతావరణ మార్పుల వల్ల లేదా ఏ ఇతర కారణాల వల్ల ఈ కార్చిచ్చులు సంభవిస్తున్నా కూడా అవి మానవాళి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కార్చిచ్చుల నుండి వచ్చే గాలి వల్ల గాలి కాలుష్యం పెరగడం మాత్రమే కాకుండా మనుషుల్లో ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కవవుతాయి. అందుకే శాస్త్రవేత్తలు దీనికి ఒక పరిష్కారం కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు.
అమెరికాలోని క్యాలిఫోర్నియాలో ముఖ్యంగా కార్చిచ్చుల వల్ల, దాని వల్ల జరుగుతున్న కరెంటు ప్రమాదాల వల్ల బిలియన్స్లో ఆస్థినష్టంతో పాటు ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇప్పటికీ దాదాపు 46 మిలియన్ అమెరికన్లు వైల్డ్ ల్యాండ్ అర్బన్ ఇంటర్ఫేస్ (డబ్ల్యూయూఐ) ప్రాంతాల్లో నివసిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే వీరు కార్చిచ్చులు కలిగే ప్రాంతాలకు, అడవులకు దగ్గరగా ఉన్నారని అర్థం. అయితే ముందుగా వీరి ప్రాణాలను, ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడడం కోసం అమెరికన్ శాస్త్రవేత్తలు ఒక కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు.
అడవులకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మైక్రోగ్రిడ్స్ ఏర్పాటు చేయడం మంచి ఐడియా అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మామూలుగా అక్కడ చాలా ప్రాంతాల్లో రీజియనల్ గ్రిడ్స్ అనేవి ఏర్పాటయ్యి ఉంటాయి. వాటితో డిస్కనెక్ట్ అయ్యే విధంగా మైక్రోగ్రిడ్స్ను ఏర్పాటు చేయడం ఎమర్జెన్సీల సమయంలో ఉపయోగపడుతుందని, మనుషులు ఉండే ప్రాంతాలను, మనుషులను సేఫ్గా ఉంచుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ డీజిల్ జెనరేటర్స్తో నడిచే మైక్రోగ్రిడ్స్.. చాలా కాస్ట్లీ మాత్రమే కాకుండా ఎంతో కాలుష్యాన్ని విడుదల చేస్తాయని వారు తెలిపారు.
పలువురు శాస్త్రవేత్తలు కలిసి క్లీన్ ఎనర్జీ మైక్రోగ్రిడ్స్ కూడా ఉంటాయని కనిపెట్టారు. ఇవి ఇతర మైక్రోగ్రిడ్స్తో పోలిస్తే మెరుగ్గా పనిచేస్తాయని అన్నారు. ఇవి ఎక్కువగా సోలార్పై, బ్యాటరీలపై ఆధారపడతాయని తెలిపారు. క్లీన్ ఎనర్జీ మైక్రోగ్రిడ్స్ అనేవి మనుషులపై ఎక్కువ కరెంటు భారాన్ని కూడా మోపకుండా ఉపయోగించే విధంగా ఉంటాయన్నారు. మైక్రోగ్రిడ్స్ ఆలోచన మంచిదే అయినా ఒకేసారి ఇన్ని ప్రాంతాలకు ఏర్పాటు చేయడానికి సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ త్వరలోనే కార్చిచ్చు రిస్క్ ఉన్న ప్రాంతాలలో నివసించే ప్రతీ ఇంటికి మైక్రోగ్రిడ్ వస్తుందని హామీ ఇచ్చారు.