Mental problems due to AI : ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అనేది ఉద్యోగులను ఇప్పటికే తన ఆదీనంలో పెట్టుకుంది. చాలామంది ఉద్యోగులు మాత్రమే కాదు.. టెక్ లవర్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చేతిలోకి వెళ్లిపోయారు. భవిష్యత్తులో ఇలాగే ఉంటుందా లేదా పరిస్థితి ఇంతకంటే దారుణంగా మారుతుందా అనే ప్రశ్నలు నిపుణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఏఐ సిస్టమ్స్ వల్ల యూజర్లకు పలు మానసిక సమస్యలు వస్తాయని శాస్త్రవేత్తలు బయటపెట్టడం మరింత ఆందోళనను పెంచుతోంది.
అమెరికా, తైవాన్, ఇండోనేషియా, మలేషియా.. ఈ దేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రభావాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు కొన్ని ప్రయోగాలు నిర్వహించారు. వీటి ద్వారా ఏఐను ఎక్కువగా ఉపయోగించే ఉద్యోగుల్లో ఒంటితనం అనే సమస్య మొదలవుతుందని వారు గమనించారు. మెల్లగా ఈ సమస్య ఇన్సోమ్నియాకు దారితీస్తుందన్నారు. ఏఐ సిస్టమ్స్ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఇది నేరుగా ఒంటరితనం, ఇన్సోమ్నియాకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు చెప్పట్లేదు. కానీ దానికి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు అంటున్నారు.
ప్రయోగాల కోసం పలు రంగాల నుండి వేర్వేరు పొజిషన్లలో ఉన్న ఉద్యోగులను శాస్త్రవేత్తలు సెలక్ట్ చేసుకున్నారు. వీరందరిలో కామన్గా ఒంటరితనం, ఆందోళన, ఎవరికి దగ్గర అవ్వలేకపోవడం లాంటి సమస్యలు కనిపించాయని బయటపెట్టారు. ఒంటరితనం, ఇన్సోమ్నియా మాత్రమే కాదు.. ఏఐ సిస్టమ్స్తో ఎక్కువగా కలిసి పనిచేసిన ఉద్యోగులు.. ఆఫీస్ తర్వాత ఎక్కువగా మద్యపానం కూడా తీసుకుంటున్నారని వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దీంతో ఏఐ వల్ల కలిగే సమస్యల విషయంలో శాస్త్రవేత్తలు మరింత ఆందోళన మొదలయ్యింది.
ఏఐ సిస్టమ్స్పై ఆధారపడిన ఉద్యోగులు.. ఎక్కువగా అందరితో కలవాలని కోరుకుంటున్నా కూడా కలవలేకపోతున్నారని పరిశోధనల్లో తేలింది. వర్క్ ప్లేస్ ప్రెజర్ వల్ల ఇప్పటికే ఉద్యోగుల్లో ఎన్నో శారీరిక, మానసిక సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఇదే సమయంలో ఏఐ వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఎదురయితే.. భవిష్యత్తులో పరిస్థితి దారుణంగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వాపోతున్నారు. భవిష్యత్తు అనేది పూర్తిగా ఏఐ లాంటి టెక్నాలజీల చేతుల్లోకి వెళ్లిపోతుంది. అందుకే ఇలాంటి సమస్యలు ఎదురవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత సంస్థలకు కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉద్యోగుల ఆరోగ్యం విషయంలో సంస్థలు కూడా చొరవ చూపించాలని సూచిస్తున్నారు.