Medaram Jatara:ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర.. విగ్రహాలు లేని విశిష్టమైన సమ్మక్క సారలమ్మల జాతర చాలా ప్రశస్తమైనది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మండ మెలిగే పండుగగా పిలిచే మినీ జాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఇప్పటికే మేడారం పరిసర ప్రాంతాలు భక్తులతో రద్దీగా మారాయి. రెండు రోజుల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వనదేవతల దర్శనానికి వస్తున్నారు. తలనీలాలు సమర్పించి, జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. తల్లులకు బంగారం కానుకగా సమర్పిస్తున్నారు.మేడారం మహా జాతర జరిగిన మరుసటి సంవత్సరం మండ మెలిగే పండుగ పేరుతో చిన్న జాతర జరుపుతుంటారు.
గిరిజనుల ఆరాధ్య దైవాలుగా కొలుస్తున్న, దేశంలోని అనేక రాష్ట్రాలలో ప్రజలు విశేషంగా దర్శించే సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతర కొండాకోనా పరవశించేలా ప్రారంభమైంది. పెద్ద జాతరలో దర్శనానికి రాలేని భక్తులు… ఈ జాతరలో మొక్కులు చెల్లించుకుంటారు. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన, జాతీయస్థాయిలో గుర్తించన మేడారం జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి చాలా ఘనంగా జరుగుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులతో మేడారం జన సంద్రాన్ని తలపిస్తుంది . భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మూడు కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వన దేవతల గద్దెలపై చలువ పందిళ్లు వేశారు.
భక్తుల కోసం తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు. జంపన్న వాగుకు ఇరువైపులా స్నాన ఘట్టాలు, జల్లు స్నానాలు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులను ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీపాల సౌకర్యాలు కల్పించారు. మినీ జాతరలో నాలుగు నుంచి ఐదున్నర లక్షల మంది భక్తులు తల్లుల దర్శనానికి వస్తారన్న అంచనాతో తగిన ఏర్పాట్లు చేశారు.
ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర, ఒడిస్సా తదితర రాష్ట్రాల నుంచి భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు మేడారం వస్తుంటారు. వనమంతా జనసంద్రమైన వేళ అమ్మవార్లను గద్దెల మీదకు తీసుకు వస్తారు. భక్తులు పూనకాలతో ఊగిపోతారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరకు ఐదు లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.