Makar Sankranti 2023 : బదరి వనం నేటి బదరినాథ్ సుమేరుపర్వతం దగ్గరుంది. బదరీ అంటే రేగు . పూర్వం అక్కడ అన్నీ రేగు చెట్లే ఉండేవి. ఆ రేగు చెట్లు కిందే శ్రీ మహావిష్ణువు తపస్సు చేశాడు. ఆ తపస్సు ప్రారంభించిన రోజు భోగి. నరనారాయణుడు పేరుతో ఇద్దరుగా మారి అక్కడ తపస్సు చేశాడు. నరుడుఅర్జునుడిగా పుట్టగా…నారాయణుడు శ్రీకృష్ణుడు అయ్యాడు. మహా మునులుగా అక్కడ తపస్సు చేశారు. ఇసుకతో శివలింగాన్ని చేసి పూజ చేయడం ఇక్కడ ప్రత్యేకత. మహాభారతంలోని ద్రోణపర్వంలో ఈవిషయాన్ని ప్రస్తావించారు. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు… భవిష్యత్తులో మీరు నాతో యుద్ధం చేసినా విజయం జయించేంత శక్తి మీకే దక్కుతుందని వరమిచ్చాడు. ఇక మీకు తిరుగుండదని ఆశీర్వదించాడు.
శ్రీ మహా విష్ణువు బదరీవనంలో తపస్సు చేయడం వల్ల ఆ తపస్సును శివుడు మెచ్చుకుని వరమివ్వడం..అది జరిగింది కూడా భోగి రోజే. పైగా అదే రోజు దేవతలు మెచ్చుకుని బదరీ వనంలో బాగా కాసిన పళ్లతో శ్రీ మహావిష్ణువునికి అభిషేకం చేశారు. విష్ణువు బదరిలో తపస్సు చేయడం, శివుడు ప్రత్యక్ష్యమవ్వడం, దేవతలు భోగిపళ్లతో అభిషేకం చేయడం ఇవన్నీ భోగి రోజే జరిగాయి. ఆ వేళ నుంచి భోగి పళ్లు పోయడం సంప్రదాయంగా మొదలైంది. ఆ పళ్లకు మెచ్చుకుని శ్రీ మహా విష్ణుడు చిన్న బాలుడిగా మారిపోయాడు. అందువల్లే భోగి పళ్లను చిన్నపిల్లలపై పోస్తుంటారు. కృష్ణుడు అంతటి వాడే చిన్న పిల్లవాడుగా మారి భోగి పళ్లను పోయించుకున్నాడు.
అప్పటి నుంచి భోగి పళ్లు పేరుతో రేగు పళ్లతోపాటు బంతి పూలు లాంటివి కలిపి భోగినాడు పోయడం ఆచారంగా వస్తోంది. ఇలా భోగిపళ్లు పోసుకునే సంప్రదాయం ఎవరైనా పాటించ వచ్చు. ఎవరైనా సరే ఆచరించవచ్చు. కులం, మతాలతో లింగ బేధాలో సంబంధం లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. ఇలా పోయడం వల్ల శ్రీ మహా నారాయణుడి కటాక్షంతోపాటు శివుడి కటాక్షం కూడా లభిస్తాయి. హరి హరులు ఇద్దరూ అనుగ్రహిస్తారు. విష్ణుమూర్తి ప్రారంభించిన కార్యక్రమాన్ని ఇలా కొనసాగించడంలో తప్పు లేదు.
రేగి పళ్లను అర్కఫలం అంటారు. అర్క అంటే సూర్యుడు అని అర్ధం కూడా. రేగు పళ్లు సూర్యుడి ఆకారంలో గుండ్రంగా ఉంటాయి. రంగు కూడా ఎర్రగానే ఉంటుంది. సూర్యుడి ప్రతిబింబంలాంటి రేగు పళ్లను ముత్తైదువులతో కలిసి ఆదిత్య స్త్రోతం చదువుతూ చిన్నారులకు తలమీదుగా పోయాలి. దీని వల్ల మేధాశక్తి, ఆరోగ్య శక్తి కూడా పెరుగుతాయని విశ్వాసం.