మూన్ లైటింగ్.. ఐటీ సెక్టార్లో ఈ పదం సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఇంటి నుంచే పనిచేస్తున్న కొందరు టెక్కీలు… ఖాళీ సమయంలో మరో కంపెనీలోనూ పని చేసి జీతం తీసుకుంటున్నారన్న విషయం బయటపడగానే… బడా సంస్థలన్నీ ఉలిక్కిపడ్డాయి. రెండు ఉద్యోగాలు చేస్తున్న చాలా మందిని తీసేశాయి. కానీ ఆ తర్వాత.. టెక్ మహీంద్రా లాంటి కంపెనీలు మూన్ లైటింగ్ విషయంలో సానుకూల వ్యాఖ్యలు చేయడంతో… క్రమంగా ఆ వివాదం మరుగున పడిపోయింది. మూన్ లైటింగ్ మీద ఇటీవల నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
మూన్ లైటింగ్ అంశంపై ఓ సంస్థ జూలై-సెప్టెంబర్ మధ్య నిర్వహించిన సర్వేలో… ఏకంగా 80 శాతానికి పైగా ఉద్యోగులు దాన్ని అనైతిక వ్యవహారంగానే భావిస్తున్నామని చెప్పారు. సర్వేలో పాల్గొన్న ప్రతి ఐదుగురు ఉద్యోగుల్లో ఒకరు మాత్రమే మూన్లైటింగ్ వైపు మొగ్గు చూపగా… మిగతావాళ్లు ఒక ఉద్యోగం చేస్తూ మరో ఉద్యోగం చేయడం అనైతికమేనని అభిప్రాయపడ్డారు. ఇక మూన్లైటింగ్ చేస్తున్న వారిలో 37 శాతం మంది… చేసే జాబ్ అకస్మాత్తుగా పోయినా ఆదాయం దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే రెండో ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పారు. 27 శాతం ఉద్యోగులు మాత్రం… కాస్త అదనపు ఆదాయం కోసం రెండో ఉద్యోగం చేస్తున్నామని చెప్పారు. మరోవైపు… మూన్ లైటింగ్ విషయంలో కంపెనీల అభిప్రాయం మాత్రం మరోలా ఉంది. తగినంత పని లేకపోవడం వల్లే ఉద్యోగులు మూన్లైటింగ్కు మళ్లుతున్నారని 31 శాతం సంస్థలు భావిస్తుండగా, రెండో ఉద్యోగం చేసుకునేంతగా వారికి సమయం ఉంటోందని 23 శాతం కంపెనీలు అభిప్రాయపడ్డాయి.
ఐటీ సెక్టార్లో మరో సమస్య కూడా పెరుగుతోందని సర్వేలో గుర్తించారు. ఉద్యోగుల్లో పని ఒత్తిడి, అలసట పెరిగిపోతుండటం వల్ల క్వైట్ క్విటింగ్ సమస్య పెరుగుతోందని… ఇలాంటి ఉద్యోగులు తాము ఉద్యోగంలో కొనసాగేందుకు అవసరమైన కనీస విధులను మాత్రమే నిర్వర్తిస్తూ… క్రమంగా పని నుండి తప్పుకుంటున్నారని తేలింది. ఉద్యోగంపై సంతృప్తి తక్కువగా ఉండటం, సవాళ్లు లేక బోరింగ్గా ఉండటం లాంటివి కూడా ఉద్యోగులు పని నుంచి తప్పుకోవడానికి కారణమని 33 శాతం కంపెనీలు పేర్కొన్నాయి. ఇక ఉద్యోగం విషయంలో నిబద్ధత లేకపోవడమే ఈ తరహా నిష్క్రమణలకు కారణమని 21 శాతం కంపెనీలు అభిప్రాయపడ్డాయి. ఇక ఉద్యోగుల్లో 29 శాతం మంది.. తీవ్రమైన పని భారం, అలసటే క్వైట్ క్విటింగ్కు కారణమని చెప్పారు. మేనేజర్లు, బాస్ల నుంచి సహకారం లేకపోవడం వల్లే ఈ ధోరణి పెరుగుతోందని 23 శాతం మంది ఉద్యోగులు చెప్పారు.