Maha Deepotsavam : అరుణాచలంలో నవంబర్ 17న మొదలైన కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు మహా దీపోత్సవం వెలిగించనున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు ఆలయంలో భరణి దీపాన్ని వెలిగించారు. తర్వాత భరణి దీపోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం జరిగే మహా దీపోత్సవ కార్యక్రమానికి 40 లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో 14వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు రెవిన్యూ, ఫైర్ ,మెడికల్ విభాగాలు సిద్దంగా ఉన్నాయి.
ఉత్సవాల్లో భాగంగా జరిగే మహాదీపం వేడుక ఉత్కృష్టంగా నిలుస్తుంది. ఆలయం వెనుక ఉన్న 2668 అడుగుల ఎత్తైన కొండపై ఆదివారం సాయంత్రం 6 గంటలకు మహాదీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపాన్ని వెలిగించేందుకు సేకరించిన 3500 లీటర్ల నెయ్యి, 1000 మీటర్ల ఖాదీ వస్త్రాన్ని కొండపైకి తరలించారు. వీటితో ఏడు అడుగుల పొడవు, 200 కిలోల బరువు కలిగిన జ్యోతిని వెలిగిస్తారు. కాగా.. ఈ మహాదీపాన్ని వీక్షించేందుకు 2500 మందిని మాత్రమే కొండపైకి అనుమతించనున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా గిరిప్రదక్షిణ చేసేందుకు లక్షల మంది భక్తులు అరుణాచలానికి తరలి వెళ్తున్నారు. ఇప్పటి వరకూ 30 లక్షల మందికి పైగా భక్తులు తిరువణ్ణామలై కొండకు తరలివెళ్లారు.