Nirmala : ప్రీ–బడ్జెట్ 2023 సంప్రదింపుల్లో భాగంగా వివిధ రంగాల అభిప్రాయాలు తెలుసుకుంటున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. కొవిడ్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్న రంగాలకు రెండేళ్ల టాక్స్ హాలిడే ప్రకటించాలని PHDCCI ప్రతినిధులు నిర్మలను కోరారు. హోటళ్లు, సినిమా థియేటర్లు వంటి రంగాలు కరోనా వల్ల మూడేళ్లుగా ఎంతో నష్టపోయాయని… వచ్చే రెండేళ్లు వాటికి టాక్స్ హాలిడే ప్రకటిస్తే ఆర్థికంగా నిలదొక్కుకుంటాయని విజ్ఞప్తి చేశారు. ఇక రైతు సంఘాలు… గోధుమ లాంటి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేయాలని, అలాగే కనీస మద్దతు ధర కంటే తక్కువ ధర ఉన్న ఉత్పత్తుల దిగుమతిని పరిమితం చేయాలని కోరాయి.
అగ్రి ఉత్పత్తుల ఎగుమతిపై నిషేధం వల్ల రైతుల ఆదాయం భారీగా తగ్గిపోతోందని ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్ కన్సార్టియం నిర్మల దృష్టికి తీసుకొచ్చింది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిపై నిషేధం ఎత్తివేయాలని, దాని వల్ల విదేశీ మారకద్రవ్య నిల్వలు భారీగా వస్తాయని సూచించింది. వంట నూనెలు దిగుమతి చేసుకోవడాన్ని తగ్గించేలా… దేశంలో సోయాబీన్, పొద్దు తిరుగుడు, వేరుశెనగ, ఆవాలు వంటి పంటల సాగు పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరింది. అప్పుడే వంటనూనెల కోసం విదేశీ మారక ద్రవ్యాన్ని భారీగా ఖర్చు చేయడాన్ని నియంత్రించగలుగుతామని సూచించింది.
ఇక సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా–COAI కూడా… లైసెన్స్ ఫీజును 3 శాతం నుంచి 1 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. అలాగే 5జీ నెట్వర్క్ పరికరాలపై కస్టమ్స్ డ్యూటీని మినహాయించాలని కోరింది. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ను కూడా రద్దు చేయాలని కూడా COAI ప్రతిపాదించింది. అలాగే GSTపై హేతుబద్దీకరణ అవసరమని… లైసెన్స్ రుసుము, స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలు, వేలం ద్వారా పొందిన స్పెక్ట్రమ్ చెల్లింపులపై GST తొలగించాలని నిర్మలకు విజ్ఞప్తి చేసింది. రెండో విడత మోడీ ప్రభుత్వ హయాంలో ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో… తమపై వరాల జల్లు కురిపించాలంటూ ఆయా వర్గాల నుంచి ఆర్థిక మంత్రికి విన్నపాలు వెల్లువెత్తుతున్నాయి. మరి నిర్మలమ్మ ఏం చేస్తారో చూడాలి!