Microsoft: ఆర్థిక మాంద్యం దెబ్బకు టెక్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ముమ్మరం చేశాయి. పెద్ద ఎత్తున కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. పోయిన నెలలో 10వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తొలగింపు ప్రక్రియను మైక్రోసాఫ్ట్ మొదలుపెట్టింది.
ఇప్పటి వరకు అమెరికాలోని కార్యాలయంలో పనిచేస్తున్న 617 మంది ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ తొలగించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. తొలగింపుకు గురైన వారిలో ఎక్స్బాస్, హోలోలెన్స్, సర్ఫేస్ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఉన్నారు. ఇక ఉద్యోగం కోల్పోయిన వారు టెర్మినేషన్ లెటర్లు అందినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కొత్త ఉద్యోగం వెతుక్కోవడంలో సహాయం చేయాలంటూ నెటిజన్లను కోరుతున్నారు. లేఆఫ్స్కు గురైన వారిలో భారతీయులు కూడా ఉన్నారు.