Layoff in Automobile : ఈరోజుల్లో టెక్నాలజీ సాయంతో పనులన్నీ జరిగిపోతున్నాయి. ఎక్కువమంది ఉద్యోగులు, ఎక్కువ పనిగంటల్లో అవ్వాల్సిన పని.. కేవలం కొంతమంది మనుషులతో కొద్దిగంటల్లోనే అయిపోతోంది. అందుకే ఉద్యోగులను తొలగించి టెక్నాలజీని నమ్ముకోవాలని సంస్థలు భావిస్తున్నాయి. అంతే కాకుండా ఇలా చేస్తే కంపెనీపై అదనపు జీతాల భారం కూడా ఉండదని అనుకుంటున్నాయి. తాజాగా ఒక ఆటోమొబైల్ సంస్థ కూడా అదే నిర్ణయం తీసుకుంది.
లే ఆఫ్స్ అనేది ఉద్యోగులకు పీడకలలాగా మారాయి. ముందుగా టెక్నాలజీ రంగంలో ఈ లే ఆఫ్స్ ప్రక్రియ మొదలయ్యింది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులను తొలగించే విషయంలో టెక్ సంస్థలు ఇలాంటి ఒక పద్ధతిని ప్రవేశపెట్టాయి. ఆ తర్వాత ప్రతీ రంగంలోనూ ఇదే పద్ధతి మొదలయ్యింది. ఇప్పుడు ఈ లే ఆఫ్స్ అనే మహమ్మారి ఆటోమొబైల్ సంస్థల వరకు వచ్చేసింది. కంపెనీ ఆదాయం, లాభాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఎన్నో ఆటోమొబైల్ సంస్థలు లేఆఫ్ నిర్ణయాన్ని తీసుకున్నాయి. తాజాగా ఇందులో ఫోర్డ్ సంస్థ కూడా జాయిన్ అయ్యింది.
గతేడాది మార్చిలో ఫోర్డ్.. తన ఖర్చులను తగ్గించే చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఆ ప్రకటన చూసిన అందరికీ లే ఆఫ్స్ గురించే చెప్తున్నారని దాదాపు అర్థమయిపోయింది. ఇక తాజాగా భారీగా లే ఆఫ్స్కు కంపెనీ సిద్ధమయినట్టు తెలుస్తోంది. ఎంతమందిని లేఆఫ్ చేయడానికి సిద్ధమయ్యిందో తెలియకపోయినా ఏయే విభాగాల్లో ఉద్యోగులను తీసివేయనుందో బయటపడింది.
గ్యాస్, ఎలక్ట్రిక్-వెహికల్, సాఫ్ట్వేర్ విభాగాలలో పనిచేసే ఫోర్డ్ ఉద్యోగులపై ఈ లేఆఫ్ తాకిడి ప్రభావం చూపనుంది. ఈ లే ఆఫ్స్ ద్వారా ఫోర్డ్ తన ఖర్చులను దాదాపు 3 బిలియన్ డాలర్లు తగ్గించాలని సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే టెక్ రంగంలో లేఆఫ్కు గురైన సాఫ్ట్వేర్ ఉద్యోగులు కష్టాలు పడుతున్నట్టుగానే త్వరలోనే ఆటోమొబైల్ ఉద్యోగులు కూడా కష్టకాలాన్ని గడపనున్నారని పలువురు వాపోతున్నారు.