Koil Alwar Thirumanjanam:జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈనెల 27న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. పవిత్ర గర్భాలయ స్థానాన్ని సంప్రదాయ, వైఖానస ఆగమోక్తంగా శుద్ధి చేసే కైంకర్యమే కోయిల్ ఆళ్వారు తిరుమంజనం. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఈనెల 27నగా తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనంద నిలయం నుంచి బంగారు వాకిలి వరకు, ఆలయ ప్రాంగణం, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, పోటు, పైకప్పు, గోడలు, పూజా సామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేస్తారు. ఆ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచడం ఆచారంగా వస్తోంది. దుమ్మూధూళి పడకుండా స్వామి శిరస్సునుంచి పాదాల వరకు ధవళవర్ణ వస్త్రాన్ని కప్పుతారు. దీన్నే మలైగుడారం అంటారు. అక్కడే కొలువైన అనంత, గరుడ, విష్వక్సేన, సుగ్రీవ, హనుమంత, అంగద.. పరివార దేవతా మూర్తులను గరుడాళ్వార్ సన్నిధికి తరలిస్తారు. చుట్టూ తెరలు కట్టి ఈ మూర్తులకు ఏకాంతంగా తిరుమంజనం పూర్తిచేసి కొత్త పట్టువస్త్రాలతో అలంకరిస్తారు.శుద్ధి అనంతరం సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తామన్నారు.
క్రీ.శ.1535 నాటికి ఏడాదిలో పది దాకా బ్రహ్మోత్సవాలు జరిగేవట. ప్రతి బ్రహ్మోత్సవానికి ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించేవారని శాసనాలు చెబుతున్నాయి. తెలుగు నూతన సంవత్సరాది పర్వదినమైన ఉగాది, జూలైలో నిర్వహించే ఆణివార ఆస్థానం పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. స్వామి అంశగా భావించే భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని మలైగుడారం లోపలే ఉంచుతారు. గర్భాలయంలో అర్చకులు, పరిచారకులు, ఏకాంగులు మాత్రమే గోడలు, పైకప్పుకు అంటుకున్న దుమ్ముధూళి, బూజు, కర్పూర మసిని తొలగించి, శుద్ధజలంతో శుద్ధిచేస్తారు. కులశేఖరపడి మొదలు మహాద్వారం వరకు ఆలయ అధికారులు, ఉద్యోగులు శుద్ధి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.