– సారూ.. ఎక్కడ మా కేసీఆరు?
– కనిపించటం లేదని గజ్వేల్ పోలీసులకు ఫిర్యాదు
– వెతికిపెట్టాలంటూ టీపీసీసీ నేత శ్రీకాంత్ వినతి పత్రం
హైదరాబాద్, స్వేచ్ఛ: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనిపించడం లేదంటూ టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు.. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ఆచూకీ తెలుసుకుని నియోజకవర్గ ప్రజల ముందుకు తీసుకు రావాలని పోలీసులకు చేసిన ఫిర్యాదులో స్పష్టం చేశారు. అనంతరం గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు మాట్లాడుతూ… కేసీఆర్ ఎక్కడున్నారో వారంలోపు జాడ తెలుపకపోతే, స్వయంగా ఆయనను వెతుక్కుంటూ తామే బయలుదేరతామని స్పష్టం చేశారు.
Also Read: దసరాలోపే కేబినెట్ విస్తరణ.. కొండా సురేఖ ఔటా..?
10 నెలలైంది.. చూసి
ఎన్నికల్లో గెలిచి దాదాపు పది మాసాలు అవుతున్నా.. నేటికీ గజ్వేల్ నియోజకవర్గంలో తమ నేత జాడ లేదంటూ వారు తమ ఫిర్యాదులో శ్రీకాంత్ వాపోయారు. ఎమ్మెల్యేగా మీ బాధ్యతలను మరిచావా కేసీఆర్? ప్రజల సొమ్మును వేతనంగా తీసుకుంటూ ఇదేం పద్దతి? అంటూ శ్రీకాంత్ రావు ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజల కాలిలో ముల్లు దిగితే పంటితో తీస్తనన్నావు కదా.. చివరికి ఆ విషయమూ మరిస్తే ఎలా అంటూ చురకలంటించారు. తమనేత గజ్వేల్ ప్రజలను మరచినా, ఆయన యోగ క్షేమాలు తెలుసుకోవాల్సిన బాధ్యత తమపై ఉన్నందునే ఫిర్యాదు చేశామని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.