Karachi Hanuman Temple :- శ్రీరామ భక్తుడు ఆంజనేయుడుకి మనదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. స్వయంభూవుగా వెలసిన క్షేత్రాలు ఉన్నాయి. మనదేశంలోనే కాదు పొరుగుదేశమైన పాకిస్థాన్ లోను జైహనుమాన్ నామస్మరణ వినిపిస్తుంది. వనవాసంలో శ్రీరాముడు సీతా సమేతంగా లక్ష్మణుడితో కలిసి కరాచీలో విడిది చేసినట్టు స్థానిక స్థల పురాణం చెబుతోంది. కరాచీలో హనుమాన్ ఆలయం యుగయుగాల నుంచి పూజలు అందుకుంటుంది, పంచముఖి ఆంజనేయస్వామి ఇప్పటికీ మనకి దర్శనమిస్తుంటాడు. శ్రీరాముడు స్వయంగా దర్శించిన క్షేత్రంగా పేరున్న ఈ ఆలయాన్ని హిందువులు ప్రతీ ఏటా సందర్శిస్తుంటారు. పురావస్తు శాఖ అంచనా ప్రకారం ఈ ఆలయానికి వెయ్యేళ్లకిపైగా చరిత్ర ఉంది.
ఇక్కడ ఎనిమిది అడుగుల ఆంజనేయుడు పంచముఖి రూపంలో భక్తులకి అభయమిస్తూ ఉంటారు. కరాచీలోని అత్యంత రద్దీ ఉన్న ఏరియాలోనే ఈ టెంపుల్ ఉంది. మన శత్రుదేశం ఒకప్పుడు మన దేశంలో భాగమైన చరిత్ర గుర్తించుకోవాలి. ప్రస్తుతం ఇస్లామిక్ రాజ్యం నడుస్తున్నప్పటికీ అక్కడ హిందూ సంప్రదాయానికి సంబంధించి ఆనవాళ్లు ఇంకా చెక్కు చెదరలేదు. ఈ ఆలయంలో స్వామి చుట్టు 21 ప్రదక్షణలు చేస్తూ మనసులో కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం.
ఈమధ్య ఆలయంలో తవ్వకాలు జరపగా ఆంజయనేయ స్వామి విగ్రహాలతోపాటు వినాయకుడి విగ్రహాలు కూడా దొరికాయి. దేశవిభజన సమయంలో రెండు దేశాలు ఏర్పడినప్పటికీ చాలా ఆలయాలు పాకిస్థాన్ భూభాగానికి చెందాయి. కొన్ని ఆలయాలను పాక్ మూకలు నాశనం చేసినప్పటికీ ఇంకా దాడుల నుంచి తట్టుకుని నిలబడ్డాయి. మైనార్టీ వర్గమైన హిందువులు ఇంకా కొంతమంది పాకిస్థాన్ గడ్డపైనే దేవుడిపై భారం వేసి బతుకుతున్నారు. మనదేశం నుంచి మహారాష్ట్ర వాసులు, సింధీలు అలాగే బలూచిలు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. స్థానిక ముస్లింలు కూడా హనుమంతుని దర్శించుకుంటారు. ఇన్నేళ్లవుతున్నా చెక్కు చెదరని రాయితో స్వామి వారి ప్రతిమను రూపొందించడం వల్లే భక్తులకి స్వామి వారి ప్రతిమ దివ్యంగా దర్శనమిస్తోంది.