Kanipakam Temple Darshan :నూతన సంవత్సరం సందర్భంగా చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. జనవరి 1న ఆంగ్ల నూతన సంవత్సరం, 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి లక్ష మంది భక్తులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. సామాన్య భక్తులకు, వీఐపీలకు ఇబ్బందులు తలెత్తకుండా దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెల్లవారుజాము రెండు గంటల నుంచి స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత స్వామికి అభిషేకాలు, అలంకరణ, చందన అలంకరణ, ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభించనున్నట్లు తెలిపారు.
జనవరి, 1, 2 వ తేదీల్లో రెండు రోజుల పాటు స్వామివారి అంతరాలయ దర్శనం ,ఆర్జిత సేవలు రద్దు చేశారు. కాణిపాకం ఆలయానికి వచ్చే భక్తుల కోసం పలు ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్లను నడిపే విధంగా ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 15న ఆలయంలో ఆలయ పునర్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. చోళుల నిర్మించిన విధంగా ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. సుమారు 2 వేల టన్నుల షీలా గ్రానైట్ రాయితో మన శాస్త్ర ప్రకారం ఆలయ పునర్ నిర్మాణం చేశారు. గతంలో ఉన్న బంగారు ధ్వజస్తంభం స్థానంలో 56 అడుగుల ధ్వజస్థంభాన్ని నిర్మించారు..
వెయ్యేళ్ల చరిత్ర కలిగిన కాణిపాకం ఆలయానికి అనుబంధ వరదరాజస్వామి ఆలయంలో జీవ ధ్వజస్తంభానికి ఇటీవల సంప్రోక్షణ నిర్వహించారు. నిత్యకైంకర్యం, యాగశాల ఆరాధన, చతుస్థానార్చన హోమం, న్యాసహోమం, మేఖల, శిఖరకుంభ, మహాపూర్ణాహుతి, కుంభ ఉద్వాసన తదితర కార్యక్రమాలు చేశారు. రాజగోపుర కలశాలు.. నూతన జీవ ధ్వజస్తంభానికి కుంభ జలంతో అర్చక, పండితులు సంప్రోక్షణ చేశారు. యజమాన మహాదాశీర్వచనం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత వరదరాజస్వామి ఉత్సవమూర్తులను కాణిపాక పురవీధులలో ఊరేగించారు