Kanaka Durga : పోతులూరు వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పారు. పొగబండ్లు నడుస్తాయని, ముఖానికి రంగు వేసుకున్న వాళ్లు నాయకులవుతారని, భర్త లేని స్త్రీ రాజ్యమేలుతుందనీ , నీళ్లు కొనుక్కుంటారని, దొంగలు రాజ్యాలు ఏలతరాని అన్నీ జరిగాయి. ఇందులో అన్ని విషయాలు మనం చూశాం.
1999లో కూడా కలియుగాంతమవుతుందని…బెజవాడ దుర్గమ్మ ముక్కుపుడకను కృష్ణమ్మ తాకబోతుందని ప్రచారం జరిగింది. అసలు అమ్మవారి ముక్కుపుడకకు కలియుగాంతానికి సంబంధమేంటి? ఇంద్రకీలాద్రిపై అమ్మవారు వెలిసినప్పుడు ఏకంగా ఉండే ఒక కొండ ఉండేది. అయితే అమ్మవారు దానిపై వెలిసినప్పుడు అమ్మవారి కుడి నేత్రం సూర్యనేత్రం. ఎడమ వైపుది చంద్రనేత్రం. అందువల్ల ఇటువైపు కొండంతా చాలా వేడిగా రగలిపోతూ ఉండేదట. అటు వైపు చాలా ప్రశాంతంగా ఉండేదట. వాటి మధ్య అమ్మవారు ఉండేవారు.
ఒకసారి బ్రహ్మదేవుడు సహ్యాద్రి పర్వతాల దగ్గర తప్పస్సు చేశాడు. పరమేశ్వరుడు, విష్ణువు ఇద్దరూ ప్రత్యక్షమయ్యారు. మహా విష్ణువు శ్వేతాత్వ చెట్టూ రూపంలో, శివుడు అమ్లకా చెట్టు రూపంలో ప్రత్యక్షమయ్యారు. బ్రహ్మను అనుగ్రహించిన తర్వాత ఆ రెండు వృక్షాలు నదీస్వరూపంగా మారి కిందకు వచ్చేసింది. ఒక నది పేరు కృష్ణ, మరో నది పేరు వేణి. ఈ రెండు సతారా అనే చోట కలిసి కృష్ణవేణిగా మారింది. అలా అక్కడ నుంచి ప్రవహించిన కృష్ణవేణి ఇంద్రకీలాద్రి దగ్గరకు వచ్చేటప్పుడు పర్వతం అడ్డొచ్చిందట. పెద్ద ప్రవాహం వచ్చి ఇంద్రకీలాద్రి కొట్టేద్దామన్న రీతిలో వచ్చిందట.
అప్పుడు ఒక అల అమ్మవారి ముక్కుపుడకను తాకిందట. అప్పుడు అప్పుడు అమ్మవారు ఆగమని చెప్పి ఇది సమయం కాదన్నారట. కలియుగాంతంలో ప్రళయం వస్తుంది…అప్పుడు ఈ పని చేయచ్చని దుర్గమ్మ సెలవిచ్చిందట. అప్పుడు ప్రవాహదాటికి కొండ ముక్కలుగా చీలడంతో.. మధ్య నుంచి కృష్ణమ్మ వెళ్లిపోయింది. అలా విడిపోయిన కొండల్లో ఒకటి ఇంద్రకీలాద్రి. మరోటి నది అవతల మంగళగిరి కొండ. ఆ కొండే అగ్నినేత్రం ఉన్న వైపు కొండ. అందుకే ఆ వేడిని చల్లార్చడానికి పానకం పోయాలని ఉపాసకులు చెప్పారు. ఇది దుర్గమ్మ ముక్కపుడక కథ.