JEE Main Results : విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం ఉదయం తుది కీ విడుదల చేసింది. తాజాగా జేఈఈ మెయిన్ రిజల్ట్స్ ను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్ ,పుట్టిన తేదీ ఎంటర్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లోని ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించారు.
ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జేఈఈ మెయిన్ తొలి విడత ఎగ్జామ్స్ జరిగాయి. ఈ పరీక్షకు 9 లక్షల మందిపైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పేపర్ -1 ను 8.60 లక్షల మంది రాశారు. బీ.ఆర్క్/బీ. ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పేపర్ -2 పరీక్షకు 46 వేల మంది హాజరయ్యారు. ఇందులో 25 వేల మంది అబ్బాయిలు కాగా.. 21 వేల మంది అమ్మాయిలు ఉన్నారు.
జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 తేదీ వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. తొలి విడత పరీక్ష రాసిన విద్యార్థులు రెండో విడత ఎగ్జామ్స్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ర్యాంకులు ప్రకటించిన తర్వాత 2.2 లక్షల మంది విద్యార్థులకు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఐఐటీలు, ఎన్ఐటీలు, ప్రభుత్వ సాంకేతిక విద్యా సంస్థల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభిస్తారు. ఇలాంటి విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులకు అంతర్జాతీయ కంపెనీల్లో భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు వస్తాయి. అందువల్లే జేఈఈ మెయిన్ , జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షలకు కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది.