Marakata Shivlinga : పరమశివుడు , బోళాశంకరుడు భక్తుల్ని అనుగ్రహించేందుకు ద్వాదశ జ్యోతిర్లింగ రూపాల్లో వెలిశాడు. శివలింగం వివిధ రూపాల్లో మనకు దర్శనమిస్తుంది. ఒక్కో లింగానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. పార్థివ లింగం, స్ఫటిక లింగం, సైకత లింగం ఇలా వివిధ రూపాల్లో కనిపిస్తుంటుంది. వీటిలో మరకత లింగం ముదురు ఆకుపచ్చ రంగులో మెరిసిపోతూ ఉంటుంది
పర్లి వైద్యనాథుడిని పోలిన బ్రహ్మసూత్రం కలిగిన మరకత శివలింగం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి సమీపంలోని చందిప్ప గ్రామంలో ఉంది. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ మరకత సోమేశ్వర లింగాన్ని సేవిస్తే వ్యాధులు పోతాయని, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం.
చందిప్ప క్షేత్రంలో మరకత లింగం
ఈ అరుదైన మరకత లింగం కొలువై ఉన్న చందిప్ప క్షేత్రానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ముచుకుంద నది ఒడ్డున ఈ క్షేత్రం కొలువుతీరింది. క్రీస్తు శకం 1076- 1126 మధ్య పశ్చిమ చాళుక్య రాజు ఆరో విక్రమాదిత్యుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని శాసనం ద్వారా తెలుస్తోంది. దాదాపు 920 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పురాతన శివాలయం కాలపరీక్షకులోనై శిథిలమైపోయింది. పదిహేనేండ్ల కిందట కొందరు భక్తులు పూనుకొని పునరుద్ధరించారు. నూతన గర్భాలయాన్ని నిర్మించారు.
శివుడు అభిషేక ప్రియుడు. ఐదు సోమవారాలు కానీ, ఐదు పౌర్ణములు కానీ, ఐదు మాస శివరాత్రులు కానీ మరకత లింగాన్ని అర్చిస్తే సకల కోరికలూ నెరవేరుతాయని విశ్వాసం. పౌర్ణమినాడు లింగాభిషేకం చేసిన జలాలతో స్నానం చేసిన వారికి వైకుంఠప్రాప్తి తథ్యమని చెబుతారు.
మరకత లింగాన్ని పూజిస్తే…
కన్యారాశి వారు మరకత లింగాన్ని పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి.కన్యారాశి వారికి అధిపతి బుధుడు.బుధుడు బుధవారానికి అధిపతి.
అందువల్ల కన్యారాశి వారు బుధవారం ఎలాంటి శుభ కార్యాలు చేసిన ఎటు వంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి.అదే విధంగా ఈ రాశి వారు సోమవారం మరకత లింగాన్ని పూజించడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు