Vikram-S : తొలి ప్రైవేట్ రాకెట్ ని విజయవంతంగా లాంచ్ చేసి ఇస్రో మరో ఘనత సాధించింది. ఉదయం 11.30 గంటలకు శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి విక్రమ్-ఎస్ సిరీస్ రాకెట్ నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది. హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ కంపెనీ స్కైరూట్ ఏరో స్పేస్ ఈ రాకెట్ ని రూపొందించింది. దేశీయంగా ప్రైవేట్ రంగంలో రూపొందించిన తొలి రాకెట్ ఇది. దీని ప్రయోగంతో మిషన్ ప్రారంభ్ విజయవంతం అయిందని ఇస్రో సైంటిస్టులు ప్రకటించారు.
టెలిమెట్రీ, ట్రాకింగ్, ఇన్ ఏరియల్ మెజర్ మెంట్, జీపీఎస్, ఆన్ బోర్డ్ కెమెరా, డాటా అక్విజిషన్ అండ్ పవర్ సిస్టం వంటి అంశాలను ఈ రాకెట్ అధ్యయనం చేయనుంది.
ఇస్రో, ఇన్ స్పేస్ సహకరాంతో రెండేళ్లలోనే దీన్ని రెడీ చేసింది. ప్రారంభ్ పేరుతో విక్రమ్-ఎస్ సిరీస్ రాకెట్లను వరుసగా పంపడానికి స్కైరూట్ ప్రణాళికలు సిద్ధం చేసింది. తొలి రాకెట్ ద్వారా స్పేస్ కిడ్స్ ఇండియా (తమిళనాడు), బజూమ్ క్యూ(ఆర్మేనియా), ఎన్-స్పేస్ టెక్ ఇండియా (ఆంధ్రప్రదేశ్) కు చెందిన మూడు పేలోడ్స్ ని నింగిలోకి పంపింది ఇస్రో.
విక్రమ్-ఎస్ కు చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. దీని ద్రవ్యరాశి 545 కిలోలు. ఇక దీని పొడవు 6 మీటర్లు. పేలోడ్ సామర్థ్యం 83 కిలోలు. విక్రమ్-ఎస్ రాకెట్ లాంచ్ తో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని భావిస్తున్నారు.