Prices and Taxes in Budget:2014లో మోడీ అధికారంలోకి వచ్చిన నాటికి, ఇప్పటికీ.. అటు ధరలు, ఇటు పన్నులు… అన్నీ భారీగా పెరిగిపోవడంతో సామాన్యుల జీవితం దుర్భరంగా మారింది. కూరగాయల నుంచి గ్యాస్ దాకా… ఏది కొనాలన్నా ఇప్పుడు భయపడాల్సిందే. దానికి తోడు జీఎస్టీ అమల్లోకి వచ్చాక… బట్టలతో మొదలుపెట్టి, అంతకుముందు ట్యాక్స్ లేని ఎన్నో వస్తువుల మీద భారీగా పన్నులు విధించి… జనం జేబులు గుల్ల చేస్తున్నారు. దాంతో… వచ్చే బడ్జెట్లో అయినా ఉపశమనం కలిగించే నిర్ణయాలు ఉంటాయా? అని… సామాన్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం ధరల పెరుగుదలే ఎక్కువ మందికి గుదిబండలా మారింది. అందుకే… పాలు, కూరగాయలు, వంట దినుసులు, నూనెలు, పెట్రోల్ ధరల పెరుగుదలను కట్టడి చేసేలా… బడ్జెట్లో నిర్ణయాలు ఉండాలని ప్రతీ సామాన్యుడు కోరుకుంటున్నాడు. వీటితో పాటు మందులు, గృహ నిర్మాణం కోసం వాడే స్టీల్, సిమెంట్పై జీఎస్టీ తగ్గించాలనే డిమాండ్ కూడా ఉంది. బీమా పాలసీల ప్రీమియంపైనా 18 శాతం జీఎస్టీ విధిస్తుండటంతో… దాన్ని కూడా 5 శాతానికి పరిమితం చేస్తే… ప్రతీ వ్యక్తికి మేలు జరుగుతుందనే భావన ఉంది. పీఎం కిసాన్ పథకం కింద ఒక్కో రైతుకు ఏటా ఇస్తున్న రూ.6 వేల మొత్తాన్ని కూడా పెంచాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది.
ప్రస్తుతం రూ.2.5 లక్షల వరకు వార్షికాదాయం కలిగిన వారికి ఎలాంటి ఆదాయ పన్ను లేదు. ఎప్పుడో తొమ్మిదేళ్ల కిందట రూ.2 లక్షలుగా ఉన్న వార్షికాదాయ పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచారు. ఆ తర్వాత రూ.2.51 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయం ఉన్నా పన్ను చెల్లించే అవసరం లేకుండా రాయితీ కల్పించినా… బేసిక్ పరిమితిలో మార్పులు చేయలేదు. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ భారీగా పెరిగిపోవడంతో… వార్షికాదాయ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల దాకా చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై బడ్జెట్లో సానుకూల ప్రకటన ఉండబోతోందనే అంచనాలున్నాయి. ప్రస్తుతం రూ.10 లక్షల ఆదాయం మించితే 30 శాతం పన్ను కట్టాలి. రూ.20 లక్షల దాకా వార్షికాదాయం ఉన్న వారికి కూడా… 20 శాతం పన్ను మించి ఉండకూడదనే డిమాండ్ బలంగా ఉంది.