Indians going abroad : విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య ఏటికేడు భారీగా పెరిగిపోతోంది. ఈ ఏడాది స్టూడెంట్ వీసాలపై విదేశాలకు వెళ్లిన భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2022లో దాదాపు 6.5 లక్షల మంది విద్యార్థులు విద్య కోసం ఇతర దేశాలకు వెళ్లారని… ఇది కొవిడ్ కాలానికి ముందు వెళ్లిన వారి కంటే అధికమని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ తెలిపింది. తాజా డేటా ప్రకారం నవంబర్ 30 వరకు 6,48,678 మంది విద్యార్థులు స్టూడెంట్ వీసాలపై విదేశాలకు వెళ్లారు. ఇది ఐదేళ్ల గరిష్ట స్థాయి కావడం విశేషం.
విద్యార్థి వీసాలతో పాటు, విజిటింగ్ వీసాలపై ప్రయాణించే భారతీయుల సంఖ్య కూడా 2022లో గణనీయంగా పెరిగిందని నివేదిక పేర్కొంది. జనవరి-నవంబర్ మధ్య కాలంలో 1.83 కోట్ల మంది భారతీయులు వివిధ అవసరాల కోసం ఇతర దేశాలకు వెళ్లారు. ఇందులో 72.49 లక్షల మంది నివాసం కోసం వెళ్లగా, 30.85 లక్షల మంది టూరిస్ట్ వీసాలపై వెళ్లారని, 40.92 లక్షల మంది విదేశాలకు వెళ్లేందుకు విజిటింగ్ వీసాలు పొందారని నివేదిక పేర్కొంది. మొత్తం మీద, 2021తో పోలిస్తే విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య 137 శాతం పెరిగిందని తెలిపింది.
2019లో ఇతర దేశాలను సందర్శించిన మొత్తం భారతీయుల సంఖ్య 2.52 కోట్లు. వీరిలో 63.80 లక్షల మంది పర్యాటక వీసాలపై, 42.11 లక్షల మంది విజిటింగ్ వీసాలపై వెళ్లగా… 89.50 లక్షల మంది భారతీయులు నివాసం, రీ-ఎంట్రీ ప్రయోజనాల కోసం వెళ్ళినట్లు నివేదిక పేర్కొంది. అందులోనూ బ్రిటన్, కెనడాలకే ఎక్కువ మంది రాకపోకలు సాగించారని తెలిపింది. 2019లో 6.17 లక్షల మంది భారతీయులు కెనడాకు వెళ్లగా, ఈ ఏడాది మొదటి 11 నెలల్లో వారి సంఖ్య 6.60 లక్షలకు పెరిగింది. ఇండియా నుంచి బ్రిటన్ వెళ్లిన ప్రయాణికుల సంఖ్య 2019లో 7.45 లక్షలు కాగా… 2022లో అది 7.54 లక్షలుగా ఉంది.