సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చేసిన ఎన్నో అద్భుతమైన టెక్నాలజీలలో డ్రోన్స్ కూడా ఒకటి. డ్రోన్స్ తయారు చేసిన మొదట్లో కేవలం అమెరికా, చైనా మాత్రమే వీటిని ఉపయోగించేవి. కానీ ఇప్పుడు ప్రతీ యుద్ధంలో వీటిని ఉపయోగిస్తున్నారు. తాజాగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం సమయంలో కూడా డ్రోన్స్ ముఖ్య పాత్ర పోషించాయి. ఇప్పుడిప్పుడే ఈ ఫ్లైయింగ్ మిషిన్ల సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి.
డ్రోన్లు మానవాళికి సాయం చేసే ప్రక్రియలో ఎంతో సహాయపడతాయి. కానీ ప్రస్తుతం వీటిని కేవలం యుద్ధరంగానికి మాత్రమే పరిమితం చేశారు. ఎన్నో ప్రైవేట్ బిజినెస్ సంస్థలు డ్రోన్ల సాయంతో తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని భావిస్తున్నారు. కానీ అవన్నీ చాలావరకు ఆలోచనల వరకే పరిమితమవుతున్నాయి. మరి ఇండియా ఈ డ్రోన్ల తయారీలో ఏ స్థానంలో ఉందో అని కొందరు సందేహిస్తున్నారు.
వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చే ఇండియా వంటి దేశాల్లో డ్రోన్ల వినియోగం కూడా ముందుగా వ్యవసాయం నుండే మొదలయ్యింది. పొలాల్లో మందులు, ఎరువులు చల్లడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు కొందరు రైతులు. అంతే కాకుండా మొక్కలను నాటడానికి కూడా ఈ డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి. కోవిడ్ సమయంలో దూర ప్రాంతాలకు వ్యాక్సిన అందజేయడానికి డ్రోన్లు వినియోగించారు. దూర ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితి ఉన్నప్పుడు డ్రోన్లు వారికి సాయంగా నిలుస్తున్నాయి.
ప్రస్తుతం పెళ్లిల్లలో, పంట పొలాల్లో.. ఇలా ప్రతీచోట డ్రోన్లు మనకు ఎదురవుతూనే ఉన్నాయి. డ్రోన్లకు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా వాటి తయారీలో సాయం చేస్తోంది. ఇండియన్ డ్రోన్ ఇండస్ట్రీని ఇంకా ముందుగా తీసుకువెళ్లడానికి డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సన్నాహాలు చేస్తోంది.
ఒకప్పుడు డ్రోన్ల తయారీ, వినియోగం కొన్ని రంగాల వరకే పరిమితమయ్యింది. కానీ 2021 తర్వాత దీనిలో మార్పులు వచ్చాయి. డ్రోన్ల తయారీలో సంస్థలకు స్వేచ్ఛ ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. మ్యాపింగ్ వంటి విషయాల్లో డ్రోన్లు ప్రభుత్వానికి చేయూతను అందిస్తున్నాయి. అంతే కాకుండా సరిహద్దుల్లో శత్రువుల కదలికలను గమనించడానికి కూడా డ్రోన్లను ఉపయోగించడం మొదలుపెట్టారు సైనికులు. అందుకే డిఫెన్స్ వంటి రంగాల్లో డ్రోన్లకు ప్రత్యేక స్థానం ఉంది.
అదానీ గ్రూప్లాంటి ప్రైవేట్ సంస్థలు కూడా డ్రోన్ల తయారీ విషయంలో అంతర్జాతీయ సంస్థలతో చేతులు కలిపారు. డ్రోన్ల తయారీ ఇండియాలోనే జరిగినా.. దానికి కావాల్సిన వస్తువులు మాత్రం వేరే దేశాల నుండే దిగుమతి జరుగుతోంది. డ్రోన్ ఇండస్ట్రీ మెరుగుపడుతున్న ఇలాంటి సమయంలో వాటి తయారీకి కావాల్సిన వస్తువులు కూడా ఇండియాలోనే తయారు చేసుకోవడం మంచిదని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే దానికి తగిన నిర్ణయాలు కూడా తీసుకోనున్నట్టు సమాచారం.