Rewind 2023: కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు మందగమనం వైపు సాగాయి. అయితే.. అందుకు భిన్నంగా భారత్ కీలక రంగాల్లో పురోగతి కారణంగా ముందడుగు వేసి ప్రపంచపు అతిపెద్ద అయిదవ ఆర్థిక వ్యవస్థగా నిలిచి ప్రపంచాన్ని అబ్బుర పరచింది. స్థిరమైన వృద్ధి రేటు, అదుపులో ఉన్న ద్రవ్యోల్బణం, సేవారంగంలో పురోగతి, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల విశ్వాసం.. ఈ మార్పుకు దోహదం చేశాయని చెప్పాలి.
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం మన తలసరి ఆదాయం రూ.98,374 కాగా.. మన జీడీపీ (స్థూల జాతీయోత్పత్తి) 3.12 కోట్ల కోట్ల రూపాయలు.(3.75 ట్రిలియన్ డాలర్లు). భారత్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. 2027 నాటికి 4.16 కోట్ల కోట్ల రూపాయల(5 ట్రిలియన్ డాలర్లు) ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది.
2022 జులై – సెప్టెంబరులో జీడీపీలో 6.2 వృద్ధిని నమోదు చేసిన మన ఆర్థిక వ్యవస్థ.. 2023 సెప్టెంబరు నాటికి 7.6 శాతానికి చేరింది. ఈ ఏడాది చివరి నాటికీ ఈ నిలకడైన ధోరణి కొనసాగి, డిసెంబరు చివరి నాటికి ఏడాది సగటు.. 6.5కి చేరనుందని అంచనా. మరోవైపు ప్రపంచ వృద్ధిలో మన వాటా 16 శాతానికి పైగా చేరిందనేది ఐఎంఎఫ్(ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) చెబుతున్న మాట.
2023లో కేవలం ఫర్వాలేదనిపించే స్థాయిలోనే విదేశీ సంస్థాగత పెట్టుబడులను మాత్రమే భారత్ ఆకర్షించగలిగింది. 2023 జనవరి నుంచి సెప్టెంబరు మధ్యకాలంలో 4.06 లక్షల కోట్ల రూపాయల ఎఫ్డీఐలు దేశంలోకి వచ్చాయి. 2014-23 కాలంలో దేశంలోకి మధ్య మొత్తం 49.6 కోట్ల కోట్ల రూపాయల ఎఫ్డీఐలను భారత్ ఆకర్షించింది. 2024లో ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకాల నేపథ్యంలో మరిన్ని పెట్టుబడులు వస్తాయనేది ప్రభుత్వ అంచనా.
2023-24 ఆర్థిక సంవత్సరంలో అక్టోబరు నాటికి పన్నుల రూపంలో రూ.13.01 లక్షల కోట్లు, పన్నేతర ఆదాయం రూ.2.65 లక్షల కోట్లు ఖజానాకు చేరాయి. అక్టోబర్ 31 నాటికి 7.85 కోట్ల ఐటీ రిటర్నులు వచ్చాయి. 2022 కంటే ఇది 11.7 శాతం ఎక్కువ.
2023 నవంబర్లో యూపీఐ చెల్లింపులు రూ.17.40 లక్షల కోట్లతో రికార్డు స్థాయికి చేరాయి. 2023- 24లో ఇప్పటి వరకు యూపీఐ లావాదేవీల విలువలో 40 శాతం వృద్ధి, సంఖ్యాపరంగా చూస్తే 50 శాతం వృద్ధి నమోదైంది. 2022 – 23లో రూ.139 లక్షల కోట్ల విలువ చేసే 8,376 కోట్ల లావాదేవీలు జరిగాయి.
2022 అక్టోబర్లో ప్రారంభమైన 5జీ నెట్వర్క్ వేగంగా విస్తరించింది. తొలి 14 నెలల్లో 13 కోట్ల మంది యూజర్లు 5జీకి మారారు. 4 లక్షల టవర్లు 5జీతో అనుసంధానమయ్యాయి. దాదాపు అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
వాహన్ డేటాబేస్ ప్రకారం 2023 డిసెంబరు మూడోవారం నాటికి 34.54 లక్షల విద్యుత్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. 2023 తొలి 11 నెలల్లో 13.87 లక్షల వాహనాలు అమ్ముడవగా, 50 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం వాహనాల్లో ప్రస్తుతం ఈవీల వాటా ఇంకా 2.4 శాతం వద్దే ఉంది.
బంగారం ఈ ఏడాది బాగానే మెరిసింది. 2023 ఆరంభంలో రూ.55,040గా ఉన్న 10 గ్రాముల పసిడి (24 క్యారెట్లు) ధర.. డిసెంబర్ 30 నాటికి అది రూ. 63,870కి చేరింది. మొత్తంగా పది గ్రాముల బంగారం ధర ఈ ఒక్క ఏడాదిలోనే రూ.8,830 (సుమారు 16%) మేర పెరిగింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితుల్లో మదుపరులు.. బంగారం మీద బాగా పెట్టుబడులు పెట్టటమే దీనికి కారణం.
2023 నవంబరులో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రూ.1.68 లక్షల కోట్లుగా ఉంది. నిరుటి నవంబరుతో పోల్చితే ఇది 15 శాతం అధికం. ఈ ఏడాది ప్రతినెలా సగటున రూ.1.66 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు రాగా.. ఏప్రిల్లో అత్యధికంగా రూ.1.87 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది.