Donation : జ్యేష్ఠ మాసం శుక్ల పక్షంలో వచ్చే ద్వాదశిని రామలక్ష్మణ ద్వాదశి అంటారు. దీనికే చంపక ద్వాదశి గా కూడా పిలుస్తారు.ప్రతినెలా శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి విశేషమైనదే . అందులోను జ్యేష్ఠ మాసంలో వచ్చే శుక్ల ద్వాదశి నాడు శ్రీరామచంద్రుడిని పూజించాలని వరాహ పురాణం చెబుతోంది. జ్యేష్ఠ ఏకాదశి నాడు బంగారంతో చేయించిన రామలక్ష్మణ విగ్రహాలను పూజించి, తర్వాతి రోజు వాటిని దానంగా ఇవ్వాలని ధర్మశాస్త్రం చెబుతోంది. అంటే ద్వాదశి ఇలాంటి దానం చేయడం ఉత్తమం. స్థోమత లేని వారు శ్రీరామ చంద్రుల మట్టి ప్రతిమలను పూజించి దానం ఇచ్చినా అదే ఫలితం దక్కుతుందిశ్రీరాముడు విష్ణుమూర్తి స్వరూపుడైతే, లక్ష్మణుడు ఆదిశేషుడు రూపం. కేవలం రామలక్ష్మణలను ద్వాదశి నాడు వారిద్దరినీ పూజించడం వల్ల గవామయన యాగం చేసిన ఫలితం కలుగుతుంది.
ఒక ఏడాది పాటు నిర్విఘ్నంగా యాగం చేయడాన్ని గవామయన యాగం అంటారు. అలాంటా యాగం చేసిన ఫలితం ద్వాదశి పూజతో కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. జగద్గురు ఆదిశంకరా చార్యుల వారు కైలస గమనం కూడా ఇదేరోజు జరిగిందని చెబుతారు. పూరి జగన్నాధ స్వామికి ఇవాళ ప్రత్యేక పూజలు చేస్తారు. చంపక ద్వాదశి రోజు విష్ణు ఆలయాన్ని సందర్శించి పూజలు చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. త్రేతాయుగంలో శ్రీరాముడ్ని కొడుకుగా పొందడానికి దశరథ మహారాజు ద్వాదశి రోజే పుత్రకామిష్టియాగాన్ని ప్రారంభించారట. మరుసటి ఏడాది చైత్రమాసంలో నవమి రోజు శ్రీరాముడు జన్మించాడు.
ఇవాళ సాయంత్రం పూట కనకధార స్త్రోత్రాన్ని చదివినా, విన్నా విశేషమైన ఫలితం కలుగుతుంది. ఆర్ధికంగా మంచి శుభఫలితాలను పొందుతారని శాస్త్రం చెబుతోంది. శ్రీమహా విష్ణు చిత్ర పటం దగ్గర ఉసిరితో దీపాన్ని వెలిగిస్తే మంచిది. అలా చేయలేని వారు శ్రీ మహాలక్ష్మికి ఉసిరికాయను నైవేద్యంగా పెట్టిన ఆమె అనుగ్రహానికి పాత్రులవుతారు.ఇలాంటి పూజలు చేయలేని వాళ్లు కనకధార స్త్రోత్రాన్ని చదివి ఉసిరికాయ పచ్చడిని చుట్టపక్కల వాళ్లకు పంచిపెట్టినా ఫలితాన్ని పొందుతారు. ఉసిరిదానం మానసికమైన సమస్యలకు తొలగిపోతాయి.