Adani Group:షేర్లలో భారీగా అవకతవకలకు పాల్పడుతోందని వచ్చిన ఆరోపణలపై అదానీ గ్రూప్ సుదీర్ఘ వివరణ ఇచ్చినా… హిండెన్బర్గ్ మాత్రం కొట్టిపారేస్తోంది. జాతీయవాదం పేరుతో మోసాన్ని దాచిపెట్టలేరంటూ… అదానీ గ్రూప్పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది… హిండెన్బర్గ్. కీలక విషయాల నుంచి భారత్ దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తోన్న అదానీ గ్రూప్.. జాతీయవాద అంశాన్ని లేవనెత్తుతోందని హిండెన్బర్గ్ మండిపడుతోంది. భారత్పై దాడి చేసేందుకే తమ నివేదిక అన్నట్లుగా అదానీ గ్రూప్ ప్రచారం చేస్తోందని… దీన్ని తాము ఏ మాత్రం అంగీకరించబోమని ప్రకటించింది.
భారత్ శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశమని, భవిష్యత్తులో అగ్రరాజ్యంగా అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం తమకు ఉందని హిండెన్బర్గ్ పేర్కోంది. జాతీయవాదం ముసుగులో దేశాన్ని క్రమపద్ధతిలో దోచుకుంటున్న అదానీ గ్రూప్… దేశ భవిష్యత్తుకు అడ్డంకిగా మారుతోందని తాము బలంగా నమ్ముతున్నామని చెప్పింది. ఉన్న వాళ్లైనా, లేని వాళ్లైనా… మోసం ఎప్పటికీ మోసమేనని… జాతీయవాదం పేరుతో లేదా అస్పష్టమైన జవాబులతో మోసాన్ని దాచిపెట్టలేరని హిండెన్బర్గ్ ఓ రేంజ్ లో ఫైరైంది. తాము 82 ప్రశ్నలు అడిగితే అందులో 62 ప్రశ్నలకు అదానీ గ్రూప్ సమాధానాలు చెప్పలేదని, దీన్ని బట్టి ఆ సంస్థ మోసానికి పాల్పడినట్లు తెలిసిపోతోందని హిండెన్బర్గ్ వ్యాఖ్యానించింది.
స్థాపించిన నాటి నుంచి హిండెన్బర్గ్ మొత్తం 16 కంపెనీలపై… అవకతవకలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు చేసింది. వాటిలో ట్విట్టర్ లాంటి బడా సంస్థలు కూడా ఉన్నాయి. హిండెన్బర్గ్ ఏదైనా కంపెనీపై గురిపెడితే… 6 నెలలకు పైగా పబ్లిక్ రికార్డులు, అంతర్గత కార్పొరేట్ పత్రాలను పరిశీలించి, కంపెనీ ఉద్యోగులతో మాట్లాడి సమాచారం సేకరిస్తుంది. ఆ తర్వాత తమతో కలిసి పనిచేసే భాగస్వాములకు వాటిని చేరవేస్తుంది. వాళ్లు ఆ కంపెనీ షేర్లలో షార్ట్ పొజిషన్లు తీసుకొంటారు. ఆ తర్వాత హిండెన్బర్గ్ ఆరోపణలు చేయగానే… ఆ కంపెనీ షేర్ల విలువ భారీగా పతనమవుతుంది. అప్పుడు వెంటనే వాటిని కొనడం ద్వారా… హిండెన్బర్గ్, దాని భాగస్వాములు ఆదాయం పొందుతారు. 2020లో అమెరికాలోని నికోలా కార్పొరేషన్ను హిండెన్బర్గ్కు ఇలాగే లక్ష్యంగా చేసుకుంది. ఆ కంపెనీలో అవకతవకలు జరిగాయని బయటపెట్టగానే… కంపెనీ స్టాక్ విలువ 40 శాతం పడిపోయింది. ఆ తర్వాత అమెరికా ఎస్ఈసీ దర్యాప్తులో… నికోలా కార్పొరేషన్లో మోసం జరిగినట్లు గుర్తించారు.