JC: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసానికి సమీపంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రహరీ నిర్మాణ పనులు ఉద్రిక్తతంగా మారాయి. పనుల కోసం ప్రొక్లెయిన్తో గుంతలు తవ్వుతుండగా తాగునీటి పైపు లైన్ పగిలిపోయింది. దీంతో జేసీ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో జేసీ ఇంటి వద్దకు పెద్దఎత్తున అనుచరులు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. రహదారికి 60 అడుగుల రోడ్డు ఉందని, ఏమీ తెలియకుండా ఎమ్మెల్యే పెద్దారెడ్డి రోడ్డుపైనే ప్రహరీ నిర్మిస్తున్నారని జేసీ అనుచరులు మండిపడ్డారు.
ప్రహరీ నిర్మాణ పనులకు 60 అడుగుల రోడ్డును వదిలిపెట్టి పనులు చేపట్టాలని జేసీ ప్రభాకర్ రెడ్డి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో నిర్మాణ పనులు వివాదంగా మారాయి. గతంలోనే వంద అడుగుల బైపాస్ రోడ్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయని, కొంత భూసేకరణ జరిగిందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా వీటన్నింటిని బేఖాతర్ చేస్తూ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఒత్తిడితో అధికారులు పనులను ప్రారంభించారని ఆరోపించారు.
అటు.. ప్రహారీ నిర్మాణ పనుల ప్రారంభం వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ ధరణీబాబు ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ సిబ్బంది బందోబస్తుగా ఉన్నారు. పనులను పరిశీలించిన జేసీ.. అక్కడున్న సిబ్బందితో మాట్లాడారు. 60 అడుగుల రోడ్డు వెడల్పు తర్వాత పనులు చేయాలని.. లేకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పోలీసులు బందోబస్తు నడుమ నిర్మాణ పనులు కొనసాగాయి.