Kia Car : మార్కెట్లోని పోటీని బట్టి ఆటోమొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలతో ముందుకు రావాల్సి ఉంటుంది. అలాంటి మార్పులు కొందరు కస్టమర్లకు నచ్చకపోయినా.. సంస్థకు మాత్రం మంచి జరుగుతుందని యాజమాన్యం నమ్ముతుంది. వివిధ దేశాల్లోని మార్కెట్స్ను బట్టి సంస్థల నిర్ణయాల్లో మార్పులు జరుగుతుంటాయి. తాజాగా ఇండియన్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ కార్ల కంపెనీ కియా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ప్రముఖ కొరియన్ ఆటోమొబైల్ కంపెనీ కియా.. కార్నివల్ ఎమ్పీవీ కార్ మోడల్ తయారీని ఇండియన్ మార్కెట్ నుండి తొలగించాలని నిర్ణయించుకుంది. ఇండియాలోని అధికారిక కియా వెబ్సైట్లో ప్రీమియం ఎమ్పీవీకి సంబంధించిన మోడల్స్కు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా తొలగించింది. ఇంతకు ముందు ఇండియాలో కియా మోడల్స్లో లాంచ్ అయిన కార్నివల్ మోడల్ నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉండేది. కానీ తాజాగా వచ్చిన కార్నివల్ మోడల్ నుండి బీఎస్6 ఫేజ్ 2 అప్డేట్ అనేది ఏమీ రాలేదు.
అప్డేట్ రాకపోవడంతో అప్పుడే కస్టమర్లకు ఈ మోడల్ ప్రొడక్షన్ గురించి అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడు కార్నివల్ ప్రొడక్షన్ ఆగిపోయినా కూడా మళ్లీ వచ్చే ఏడాది తప్పకుండా ఇండియన్ మార్కెట్లోకి ఈ మోడల్ అడుగుపెడుతుంది అని కొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని మార్పులు చేర్పులు చేసిన తర్వాత ప్రీమియం ఎమ్పీవీ మోడల్ మరింత అడ్వాన్స్డ్ రూపంలో కస్టమర్ల ముందుకు వస్తుందని భావిస్తున్నారు. కార్నివల్ మోడల్ను కేఏ4 మోడల్తో రీప్లేస్ చేసే ఆలోచనలో కియా ఉన్నట్టు కొన్ని ఆటోమొబైల్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.