Under construction building collapses in Bengaluru: కర్ణాటక రాష్ట్రంలో కుండపోత వర్షం పడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రతరం కావడంతో పాటు తుఫానుగా మారింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బెంగళూరులో భారీ వర్షం కురుస్తోంది.
బెంగళూరు పట్టణంలోని దక్షిణ ప్రాంతంలో అనేక కాలనీలు జలమయమయ్యాయి. ఒక్కసారిగా వరద నీరు వచ్చి చేరడంతో యలహంకలోని కేంద్రీయ సదన్ పూర్తిగా జలమయమైంది. ఎన్డీఆర్ఎఫ్ , ఎస్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. వరద బాధితులను పడవల సహాయంతో బయటకు తీసుకొచ్చారు. దీంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే, బెంగళూరులో భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న భారీ భవనం కుప్పకూలింది. బాబూసాపాల్య సమీపంలో ఉన్న భవనం వర్షానికి తడిసి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరికొంతమందికి గాయాలయ్యాయి.
ఈ ఘటన జరిగిన సమయంలో కొంతమంది కార్మికులు తప్పించుకోగా.. మరికొంతమంది భవనం శిథిలాల కింద చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న బెంగళూరు పట్టణ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయన పడిన వారికి స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Also Read: నేను నా మాటకు కట్టుబడి ఉన్నా.. సారీ చెప్పను.. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్
కాగా, అల్పపీడనం కాస్త తుఫాను గా మారింది. దీంతో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీటిలో మునగగా.. మళ్లీ భారీ వర్షాలు కురవడంతో బిక్కు బిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు.