Hand Foot Mouth disease in Andhra Pradesh: రాష్ట్రంలో మరో కొత్త రకం వ్యాధి కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ అనే వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తుంది. ఈ అంతకుచిక్కని వ్యాధి నెలల శిశువుల నుంచి ఆరేళ్ల వయస్సున్న చిన్నారులకు అధికంగా సోకుతున్నట్లు గుర్తించారు.
ఈ వ్యాధి కాక్సీకీ అనే వైరస్ ద్వారా సంక్రమిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ వ్యాధి ప్రమాదకరం కాదని, భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఈ వ్యాధిని ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ అని పిలుస్తున్నారు. ఈ వ్యాధి సోకిన పిల్లలు తీవ్ర అనారోగ్యం బారిన పడుతారని వైద్యులు తెలిపారు.
ఈ వ్యాధి సోకిన పిల్లల్లో ప్రధానంగా జ్వరం, తలనొప్పి, జలుబు, చేతులు, కాల్లు, ముఖం, నోటిలో పుండ్లు, దద్దుర్లు, మంట వంటి లక్షణాలు ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య పెరుగుతందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. కొన్ని జాగ్రత్తలు, మెడిసిన్స్ తీసుకుంటే తగ్గుతుందని చెప్పారు. అయితే గతేడాదితో పోల్చితే ప్రస్తుతం వ్యాధి వ్యాపిస్తుందని, ఇటీవల 4 కేసులు నమోదైనట్లు తెలిపారు.
ఈ వ్యాధి సాధారణంగా కాక్సీకీ వైరస్ ద్వారా పిల్లల శరీరంలోకి వ్యాప్తి చెందుతుంది. దీంతో చేతితోపాటు కాళ్లపై, గొంతులో దద్దుర్లు రావడం, పొక్కులు వ్యాప్తి చెందుతాయి. ఈ పొక్కులు కాస్తా పుండ్లుగా మారడంతో పిల్లలు ఇబ్బందులు పడతారు. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడిన విశాఖ ప్రాంత చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు.
Also Read: ఆ ఎన్నికతో పిఠాపురంలో సీన్ రివర్స్ అయిందా.. జనసేన వర్సెస్ టీడీపీ.. ఏం జరుగుతోంది?
పిల్లల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.సకాలంలో చికిత్స తీసుకోని సమక్షంలో ఈ వ్యాధితో చిన్నారులు ఎక్కువ కాలం ఇబ్బంది పడాల్సి వస్తుందని, కావున వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. చాలా అరుదుగా ప్రాణాంతకం అని అంటున్నారు.
ఉష్ణ మండల ప్రాంతాల్లో కాక్సీకీ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని, ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుందన్నారు. ప్రధానంగా ఉమ్ము, చీమిడి, పుండ్ల ద్వారా వ్యాప్తి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు. చిన్నారుల్లో ఈ వ్యాధి సోకిన తర్వాత మిగతా పిల్లలకు వేగంగా వ్యాప్తి చెందుతుందని, అందుకే లక్షణాలు కనిపించిన వెంటనే పాఠశాలలకు వారం రోజులు సెలవు తీసుకోవాలని సూచిస్తున్నారు.
వ్యాధి వచ్చిన తర్వాత చిన్నారులకు నోటిపై పొక్కులు రావడంతో ఆహారం తీసుకునేందుకు ఇబ్బందులు పడతారని చెప్పారు. ముఖ్యంగా నీటిని తీసుకునేందుకు కూడా ఇబ్బంది పడతారని, ఈ సమయాల్లో డీహైడ్రేడ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పిల్లలను కొన్ని రోజుల పాటు బయట ప్రాంతాలకు ఆడుకోవడానికి పంపక పోవడమే మంచిదన్నారు. అలాగే చిన్నారులకు కాచి చల్లార్చిన నీటిని తాగించడంతోపాటు పిల్లలకు సంబంధించిన వస్తువులు ఎక్కడపడితే అక్కడ బయట పడేయ కూడదని వైద్యులు సూచించారు.