Good News:పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోయి అవస్థలు పడుతున్న వాహనదారులు త్వరలో శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నిసార్లు రెపో రేట్లు పెంచినా ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోవడంతో… పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ ట్యాక్స్, మరికొన్ని వస్తువులపై పన్నులు తగ్గించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి నెల ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడ్డాక కేంద్రం పన్నుల తగ్గింపుపై నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. దానికి తోడు పెట్రోల్, డీజిల్ మీద కేంద్రం భారీగా ఎక్సైజ్ ట్యాక్స్ పెంచడం, వాటి ధరల్ని అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఏ రోజుకు ఆ రోజు సవరించడంతో… ఇంధన ధరలు ఆకాశాన్ని అంటాయి. ఆ ప్రభావం అన్నింటిపైనా పడటంతో ధరలు పెరిగిపోయి… ద్రవ్యోల్బణం కూడా భారీగా పెరిగిపోయింది. దాన్ని కట్టడి చేసేందుకు నిరుడు మే నెలలో పెట్రోల్పై రూ.8, డీజిల్పై రూ.6 చొప్పున ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించింది… కేంద్రం. అయినా ఇప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉండటంతో… ద్రవ్యోల్బణం అదుపులోకి రాక, ఆర్బీఐ వడ్డీ రేట్లు భారీగా పెంచుతూ వస్తోంది. కానీ, ఏ మాత్రం ప్రయోజనం కనిపించడం లేదు.
జనవరిలోనూ వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. డిసెంబర్లో 5.72 శాతం ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం… జనవరిలో 6.52 శాతానికి చేరింది. ఆహార ధరలు విపరీతంగా పెరగడం వల్లే రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగింది. తృణధాన్యాల ధరలు 16.12 శాతం పెరగ్గా, గుడ్లు 8.78 శాతం, పాలు 8.79 శాతం మేర పెరిగాయి. దాంతో… ఆర్బీఐ సిఫార్సులకు అనుగుణంగా మొక్కజొన్నపై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. మొక్కజొన్నపై ప్రస్తుతం 60 శాతం బేసిక్ డ్యూటీ ఉండగా… దాన్ని భారీగా తగ్గించే అవకాశం ఉందంటున్నారు. ఇక అన్ని వస్తువుల ధరల పెరుగుదలకు పరోక్షంగా కారణమయ్యే పెట్రోల్, డీజిల్ మీద కూడా కేంద్రం ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించే ఛాన్స్ ఉందంటున్నారు. అయితే… అటు కేంద్రం గానీ, ఇటు ఆర్బీఐ గానీ పన్నుల తగ్గింపుపై స్పందించలేదు.