Gold price rises by Rs.6,000 : దేశంలో బంగారం ధరలు రోజురోజుకూ కొత్త గరిష్టాలను తాకుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆల్ టైమ్ గరిష్టస్థాయికి చేరుకున్న గోల్డ్ రేట్… పదో పరకో కాస్త అటూ ఇటుగా కదలడమే తప్ప… భారీగా దిగిరానంటోంది. ఒకటి, రెండు రోజులు కాస్త తగ్గినా… ఆ మర్నాడే, రెండు రోజులు తగ్గిన దాని కంటే ఎక్కువగా పెరుగుతోంది. అలా పెరిగి పెరిగి… 10 గ్రాముల బంగారం ధర 3 నెలల్లో ఏకంగా రూ.6 వేలకుపైగా ఎగసింది. గత అక్టోబర్ 20న రూ.46,500గా ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర… ప్రస్తుతం రూ.52,500కు పైనే కదలాడుతోంది. ఇక అక్టోబర్ 20న రూ.50,800లుగా ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర… ఇప్పుడు రూ.56,800 దాటిపోయింది. 3 నెలల వ్యవధిలో 10 గ్రాముల బంగారం ధరే రూ.6 వేలు పెరిగిందంటే… ఆ లెక్కన కేజీ బంగారం విలువ రూ.6 లక్షలు పెరిగినట్లు.
అక్టోబర్ నుంచే మొదలైన బులియన్ ర్యాలీ, మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చినా… మళ్లీ పట్టపగ్గాల్లేకుండా దూసుకుపోతూనే ఉంది. డాలర్ క్షీణత, ట్రెజరీ ఈల్డ్ల కారణంగానే బంగారం ధర 3 నెలల గరిష్టస్థాయికి చేరిందని విశ్లేషకులు చెబుతున్నారు. గ్లోబల్ సంకేతాలు, స్థానిక పన్నుల కారణంగా… భారత మార్కెట్లలోనూ బంగారం ధరలు రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని అంటున్నారు.
ఈ ఏడాది చివరి నాటికి తులం బంగారం రూ.70 వేలకు చేరే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. బంగారం దిగుమతులు తగ్గినా… డిమాండ్ మాత్రం తగ్గకపోవడం వల్లే ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు. రూపాయి విలువను బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా బంగారం దిగుమతులను కేంద్రం కట్టడి చేయడంతో… డిమాండ్ మేరకు బంగారం అందుబాటులో లేకపోవడం వల్లే పసిడి పరుగులు తీస్తోందంటున్నారు. మరోవైపు వినియోగదారులు మాత్రం… ధర భారీగా పెరిగినా… కొనక తప్పని పరిస్థితుల్లోనే బంగారం కొంటున్నామని చెబుతున్నారు.
Follow this link for more updates : Bigtv