రెండు మతాల భక్తులకి ఆ ప్రాంతమంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే అక్కడ రెండు వేర్వేరు మతాలకు దేవుళ్లు కొలువుదీరిన ప్రాంతం. పరమశివుడూ, గురునానక్ ఒకే చోట కొలువైన పుణ్యక్షేత్రం మణికరణ్ . హిమాచల్ప్రదేశ్లోని కులుకి 40 కిలోమీటర్ల దూరంలో ప్రాంతం ఉంది. పార్వతీ లోయ అని పిలిచే ఆ ప్రాంతం బియాస్, పార్వతీ నదుల మధ్యలో ఉంటుంది. మణికరణ్ లోని వేర్వేరు ఆలయాల్లో శివుడు, రాముడు, కృష్ణుడు, విష్ణుమూర్తి పూజలందుకుంటారు. మరోపక్క గురునానక్ కొలువుదీరిన గురుద్వార్ ఉంటుంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు సందర్శించే మణికరణ్ లో వేడినీటి బుగ్గలు ఓ అద్భుత సృష్టి. ఎముకలు కొరికే చలిలో సైతం ఆ బుగ్గల్లోని నీళ్లు పొగలు కక్కుతాయి.
బిందెల్లో బియ్యం వేసి ఎసరు పోసి ఆ నీళ్లలో ఉంచితే నిమిషాల్లో అన్నం ఉడుకుతుంది. పప్పు కూడా ఉడికిపోతుంది. అలా వండిన వంటకాలనే గురుద్వార్లో నిత్యం గురు నానక్కు నైవేద్యంగా పెడతారు. లంగరులో అన్నదానానికీ అలా వండిన అన్నమే ఉపయోగిస్తారు. మరో బుగ్గలో భక్తులు స్నానమాచరిస్తారు. ఆ వేడి నీళ్లల్లో స్నానం చేస్తే చర్మవ్యాధులు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అంతేకాదు, ఆ వేడి నీటి మర్మం వెనక శివపార్వతుల మహత్యం ఉందని హిందువులు నమ్ముతుంటారు. అదంతా గురునానక్ మాయ అని సిక్కులు విశ్వసిస్తారు.అయితే ఆ లోయలో జియోథర్మల్ ఎనర్జీ కారణంగా భూమి కింద రాళ్లు వేడెక్కడంతో బుగ్గల్లో నీళ్లు కూడా వేడిగా వస్తున్నాయని శాస్త్రవేత్తలు తేల్చేశారు.