Get Your Eyes Checked:సాధారణంగా మనం ఎక్కువశాతం చర్మం, జుట్టు ఆరోగ్యంపైనే శ్రద్ధ చూపిస్తుంటాం. కళ్ల గురించి పట్టించుకోం. ఏదైనా కంటి సమస్య వస్తే డ్రాప్స్ వేయించుకోవడం, విశ్రాంతి తీసుకోవడంవంటివి చేస్తుంటాం. మన కళ్లు కొన్ని సందర్భాల్లో టెస్ట్ చేయించుకోవాల్సిన సమయం వచ్చిందని మనల్ని హెచ్చరిస్తుంటాయి. ఈ సంకేతాలను లైట్ తీసుకుంటే కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు కళ్ళలో నొప్పి, అసౌకర్యం కార్నియా, రెటీనాలో పెద్ద సమస్యలకు సంకేతం అవుతుందంటున్నారు. రెండు కళ్లలో ఒక్కసారిగా నొప్పి వస్తే వెంటనే వైద్యుడి దగ్గరికి వెళ్లాలి. కంటికి ఏదైనా గాయం అయినప్పుడు కూడా నొప్పి, వాపు వస్తాయి. కళ్ల ముందు కొన్నిసార్లు లైట్ ఫ్లాష్లు కనిపిస్తుంటాయి. ఇలాంటివి కనిపించగానే ఆలస్యం చేయకూడదు. ఈ ఫ్లాష్లు రెటీనాలో సమస్య ఉందని చెప్పే సంకేతాలు కావచ్చు. రెటీనా వేరుకావడం, చిరిగిపోయే అవకాశం ఉన్న సమయాల్లో ఇలాంటి సంకేతాలు కనిపిస్తాయి. అలాగే కంటి మైగ్రేన్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి లైట్ ఫ్లాష్లు కనిపిస్తాయి. కళ్లు ఒక్కసారిగా కాంతికి సున్నితంగా మారినప్పుడు కంటి లెన్స్ మబ్బుగా మారుతుంది. ఇది శుక్లం యొక్క సాధారణ సంకేతం. దీన్ని నిర్లక్ష్యం చేస్తే అస్పష్ట దృష్టి, ఒక కంటిలో డబుల్ దృష్టి, రాత్రి అంధత్వం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆకస్మిక దృష్టి కోల్పోవడం ఒక తీవ్రమైన కంటి సమస్య. ఇది స్ట్రోక్ ప్రారంభ సంకేతం కూడా అవచ్చు. రక్త నాళాల్లో అడ్డంకులు ఏర్పడటంతో స్ట్రోక్ వస్తుంది. దీంతో పక్షవాతం వస్తుంది, అంతేకాకుండా మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు మరణం కూడా సంభవిస్తుంది. కనురెప్పల్లో తరచుగా దురద వస్తుంటే కళ్ల చుట్టూ సమస్య ఉందనడానికి సంకేతం. దీన్ని నిర్లక్ష్యం చేస్తే కళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. కళ్లు మంటగా అనిపించినా, కంటి నుంచి ఏకధాటిగా నీరు కారుతున్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.