food poisoning : నిత్యం తీసుకునే ఆహారాల్లో కొన్ని మన శరీరానికి పడవు. దీంతో ఫుడ్ పాయిజన్ అవుతుంది. కడుపులో తీవ్రమైన నొప్పి ఉంటుంది. అంతేకాకుండా జ్వరంతో పాటు తలనొప్పి కూడా వస్తుంది. కొన్ని సందర్భాల్లో మన చర్మంపై దద్దుర్లు కూడా కనిపిస్తాయి. దీన్ని ఫుడ్బోర్న్ ఇల్నెస్ అంటారు. మన భాషలో చెప్పాలంటే ఫుడ్ పాయిజనింగ్ అంటారు. కలుషితమైన ఆహారం, చెడిపోయిన ద్రవాలను తీసుకుంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. 60 ఏళ్లు దాటిన వారిలో, చిన్నపిల్లలు, గర్భిణుల్లో, షుగర్, ఎయిడ్స్, క్యాన్సర్ ఉన్నవారిలో కూడా ఫుడ్ పాయిజన్ ఎక్కువగా కనిపిస్తుంది. జీర్ణవ్యవస్థ బాగా ఉంటే ఫుడ్ పాయిజన్ తక్కువగా ఉంటుంది. ఆహారంతో పాటు పలు రకాల బ్యాక్టీరియా, వైరస్లు మన గట్ ఫంక్షన్లకు ఇబ్బంది కలిగిస్తాయి. కొన్ని సూక్ష్మక్రిములు మన ఆహారాన్ని విషపూరితం చేస్తాయి. ఎక్కువగా ఫుడ్ పాయిజన్ అవడానికి ఎంటామీబా ఒక కారణం. క్యాంపిలో బాక్టర్ బ్యాక్టీరియా, ఈ కోలి బ్యాక్టీరియా, నోరోవైరస్, సాల్మొనెల్లా బ్యాక్టీరియాల వల్ల కూడా ఫుడ్ పాజియిన్ అవుతుంది. ఎక్కువగా ఉడకని మాంసం, కలుషిత నీరు, పాత పిండిలో ఈ రకం బ్యాక్టీరియాలు ఉంటాయి. అందుకే మాంసాన్ని బాగా ఉడికించిన తర్వాత తింటే క్రిములు నశిస్తాయి. మురుగు నీరు, డ్రైనేజీ ఉన్న ప్రాంతాల నుంచి వచ్చిన ఆహారాలను దూరం పెట్టడం మంచిది.లేకపోతే మీరు టైఫాయిడ్ బారిన పడే అవకాశం ఉంది. సాల్మొనెల్లా బ్యాక్టీరియా కూరగాయల్లో ఉంటుంది. దీని వల్ల విరోచనాలు, డయేరియా, తీవ్రమైన కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.