Elon Musk : ట్విట్టర్ కొన్నాక అనేక ఎదురుదెబ్బలు తింటున్న ఎలాన్ మస్క్కు ఇప్పుడు మరో షాక్ తగిలింది. మనుషుల్లో చిప్ ఇంప్లాంట్ చేసే ట్రయల్స్కు అనుమతులు ఇచ్చేందుకు అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్-ఎఫ్డీఏ నిరాకరించింది. న్యూరాలింక్ అనే స్టార్టప్ కంపెనీ కో-ఫౌండర్ అయిన ఎలాన్ మస్క్… బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్-బీసీఐ అనే అంశంపై ప్రయోగాలు చేస్తున్నాడు. వీటికి అనుమతులు ఇవ్వలేమంటూ ఎఫ్డీఏ తెగేసి చెప్పడంతో… మస్క్కు షాక్ ఇచ్చినట్ట్లైంది.
ప్రయోగాల్లో… చిప్ బ్యాటరీ సిస్టమ్, దాని ట్రాన్స్డెర్మల్ ఛార్జింగ్ సామర్థ్యాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఎఫ్డీఏ… బ్యాటరీ విఫలమైతే రోగులకు ప్రమాదమని హెచ్చరించింది. ఒకవేళ బ్యాటరీ విఫలమైతే… చిప్ చుట్టుపక్కల కణజాలానికి నష్టం జరగకుండా నిరోధించడానికి తగిన చర్యలు ఉన్నాయని హామీ ఇవ్వాలని న్యూరాలింక్ను కోరింది.
ఇక ఎఫ్డీఏ లేవనెత్తిన మరొక ఆందోళనకరమైన విషయం ఏంటంటే… చిప్ను బ్రెయిన్ నుంచి తొలగించే సమయంలో మెదడులోని సున్నితమైన కణజాలం దెబ్బతినే ప్రమాదం ఉండటం. అదే జరిగితే రోగి శరీరం రంగు మారిపోవడమే కాదు… మరణం కూడా సంభవించే అవకాశం ఉందని ఎఫ్డీఏ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా అనేక అంశాల్ని పరిగణనలోకి తీసుకునే… న్యూరాలింక్ హ్యూమన్ ట్రయల్స్ను ఎఫ్డీఐ వ్యతిరేకించిందని నిపుణులు చెబుతున్నారు.
మొత్తమ్మీద టెస్లా, ట్విట్టర్లకు సంబంధించి కాకుండా… మరో అంశంలో మస్క్కు షాక్ తగలడం చర్చనీయాంశమైంది. ట్విట్టర్ కొన్నాక అనేక మందిని ఉద్యోగాల నుంచి తొలగించి, వారి జీవితాలతో ఆడుకున్న మస్క్… ఇప్పుడు మనుషుల ప్రాణాలతో కూడా ఆడుకునేందుకు సిద్ధమయ్యాడా? అని నెటిజన్లు మండిపడుతున్నారు. సాటి మనుషులంటే లెక్కలేకుండా వ్యవహరిస్తున్న మస్క్ దూకుడుకు ఎఫ్డీఐ బాగా అడ్డుకట్ట వేసిందని, ఇకనైనా మస్క్ మారాలని కోరుకుంటున్నామని అంటున్నారు. అయితే, ఎవరేం అన్నా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోవడం మస్క్ స్టైల్. ఇప్పుడు హ్యూమన్ ట్రయల్స్ విషయంలో ఎఫ్డీఐని మస్క్ ఎలా ఒప్పిస్తాడో చూడాలి మరి!