Facts of Mangalagiri Narasimha Swamy:మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి గాలిగోపురం రాష్ట్రంలో అత్యంత ఎత్తయినది. రెండు శతాబ్దాలను పూర్తిచేసుకుంది. 11 అంతస్తులతో 157 అడుగుల ఎత్తును కలిగి కేవలం 49 అడుగుల పీఠభాగంతో గాలిలో ఠీవిగా నిలబడినట్టు కనిపిస్తూ సందర్శకులను అబ్బురపరిచే అద్వితీయ నిర్మాణమిది.మరో 5 రోజుల్లో జనవరి 2 వ తారీఖు సోమవారం నాడు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో శంకు తీర్థం ఇచ్చేందుకు ఒక శంఖువు ఉంటుంది. ఫోటోలో ఉన్న ‘దక్షిణావృత శంఖు’ ఇప్పటికి సరిగ్గా 202 ఏళ్ళ క్రితం..1820 వ సంవత్సరం నవంబరు నెల 20 వ తారీఖు తంజావూరు మహారాజు అయిన ‘వెంకోజీ’ గారు మంగళగిరి శ్రీపానకాల లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానానికి బహూకరించారు… అప్పటి నుండి ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి రోజు ఈ శంఖు ద్వారానే భక్తులకు తీర్ధాన్ని అందిస్తున్నారు.
లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వాస్తవంగా రెండు దేవాలయాల కింద లెక్క. కొండ కింద ఉన్న దేవుడి పేరు లక్ష్మీనరసింహ స్వామి. కొండ పైన ఉన్న దేవుడిని పానకాల స్వామి అని అంటారు. కొండ పైని దేవాలయంలో విగ్రహమేమీ ఉండదు. కేవలం తెరుచుకుని ఉన్న నోరు ఆకారంలో ఒక రంధ్రం ఉంటుంది. ఆ తెరచుకొని ఉన్న రంధ్రమే పానకాల స్వామిగా ప్రజల నమ్మకం. పానకాలస్వామికి బెల్లం, పంచదార, చెరకు అభిషేకం చేస్తే, అభిషేకం చేసిన పానకంలో సగం పానకాన్ని స్వామి త్రాగి, మిగిలిన సగాన్ని మనకు ప్రసాదంగా వదిలిపెడతాడుట.
పానకం సగం అవగానే గుటక వేసిన శబ్దం వస్తుంది. ఇంక పానకం పోయటం ఆపి, మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ పానకాన్ని కొండపైన పూజారులే తయారు చేస్తారు. ఇంత పానకం ఇక్కడ వినియోగమవుతున్నా, ఇక్కడ ఒక్క చీమ కూడా కనిపించక పోవటం విశేషం.ఎంత పానకం అభిషేకించినా, అందులో సగమే త్రాగి, మిగిలిన సగాన్ని భక్తులకు వదలడం ఇక్కడ విశేషం. పానకాలస్వామి గుడి వెనుక కొంచెం ఎత్తులో శ్రీ లక్ష్మి ఆలయం ఉంది. దీనికి పక్కనే ఒక సొరంగం ఉంది. దాన్లోంచి వెళ్తే కృష్ణా తీరాన వున్న ఉండవల్లి గుహలకి వెళ్ళవచ్చంటారు. ఋషులు ఇదివరకు ఆ మార్గంగుండానే వెళ్ళి కృష్ణానదిలో స్నానం చేసివచ్చి స్వామిని సేవించే వారంటారు