Plastic Dumping : కొన్ని వస్తువులు.. మనుషుల జీవితానికి హాని కలిగిస్తాయని తెలిసినా కూడా వాటి వినియోగం మానవాళికి బాగా అలవాటు అవ్వడంతో వాటిని దూరం చేయలేము. అలా అవి మన రోజూవారీ జీవితాల్లో భాగమయిపోతాయి. అలాంటి వాటిలో ముఖ్యమైనది ప్లాస్టిక్. కొన్నేళ్ల క్రితమే ప్లాస్టిక్ అనేది మానవాళికి.. ముఖ్యంగా పర్యావరణానికి మంచిది కాదు అని బ్యాన్ చేసినా కూడా ఇంకా ఇది పర్యావరణానికి హాని కలిగించే రీతిలో పెరిగిపోతూనే ఉంది. తాజాగా ప్లాస్టిక్ గురించి మరిన్ని విషయాలు బయటపెట్టారు శాస్త్రవేత్తలు.
ప్రతీరోజూ దాదాపు 2000 ట్రక్కులకు సరిపడా ప్లాస్టిక్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న నదుల్లు, సముద్రాల్లో కలుస్తుంది అని శాస్త్రవేత్తలు తాజాగా చేసిన పరిశోధనల్లో తేలింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ వినియోగం గురించి మరోసారి పరీక్షలు చేపట్టారు శాస్త్రవేత్తలు. అందులో ఇలాంటి షాకింగ్ విషయాలు బయటికి వచ్చాయి. ప్రతీరోజూ 2000 ట్రక్కులకు సరిపడా ప్లాస్టిక్ను సముద్రాల్లో కలవడం అనేది మామూలు విషయం కాదని వారు హెచ్చరించారు. దీని కారణంగా మనుషులు తినే ఆహారంలోకి మైక్రోప్లాస్టిక్స్ అనేవి సులువుగా ప్రవేశిస్తున్నాయన్నారు.
ఈరోజుల్లో కేవలం తినే తిండిలో, తాగే నీటిలో మాత్రమే కాదు.. పీల్చే గాలిలో కూడా మైక్రోప్లాస్టిక్స్ అనేవి ఎక్కువయిపోయాయని, అందుకే మనుషుల్లోకి చేరడానికి సులువుగా మారిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్లాస్టిక్ అనేది ఫాజిల్ ఫ్యూయల్స్తో తయారు చేయబడుతుంది. ఎక్కువ ప్లాస్టిక్ తయారు చేయాలంటే.. ఎక్కువ ఫాజిల్ ఫ్యూయల్ను కాల్చాల్సి ఉంటుంది. దీని వల్ల వాతావరణ పరిస్థితులు మరింత దారుణంగా మారే అవకాశం ఏర్పుడుతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలు చేతులు కలిపి ఈ వాతావరణ మార్పులను, ప్లాస్టిక్ వినియోగాన్ని అదుపు చేయాలని నిర్ణయించుకున్నాయి.
మనుషులు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించగలిగితే.. మార్పు వెంటనే వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. 2040లోపు ఇలా 80 శాతం వరకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకునే అవకాశం ఉందన్నారు. ప్రతీ సంవత్సరం నదుల్లో, సముద్రాల్లో కలుస్తున్న ప్లాస్టిక్ బరువు దాదాపు 2,200 ఈఫిల్ టవర్స్ అంత ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అంటే దాదాపు 19 నుండి 23 మిలియన్ టన్నులు ఉండవచ్చని అంచనా. దీనికి సమానంగానే ప్రతీ ఏడాది దాదాపు 400 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ప్రపంచవ్యాప్తంగా తయారు చేయబడుతోంది.
మామూలుగా 5 మిల్లీమీటర్ల కంటే చిన్నగా ఉండేవాటిని మైక్రోప్లాస్టిక్స్ అంటారు. ఇవి ప్రస్తుతం గాలిలో చాలా ఎక్కువయిపోయాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే మనం పీల్చే గాలి ద్వారా కూడా ఇవి మనుషుల శరీరంలోకి ఎంటర్ అవుతున్నాయని అన్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రతీ మనిషి దాదాపు 50 వేల ప్లాస్టిక్ పార్టికల్స్ను ప్రతీ సంవత్సరం తన శరీరంలోకి కలుపుతున్నాడని అర్థం. వీటితో పాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కూడా పర్యావరణంతో పాటు మానవాళికి కూడా ఎంతో హానిని కలిగిస్తోంది. అందుకే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రపంచవ్యాప్తంగా తగ్గించాలని దేశాలు పిలుపునిచ్చాయి.