కొవిడ్ ఆంక్షలతో చైనాలోని ఫాక్స్కాన్ ప్లాంట్ నుంచి కార్మికులు గోడలు దూకి పారిపోతున్న దృశ్యాలు నెల కిందట సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు అదే ప్లాంట్ ఆవరణలో గొడవలు చెలరేగడం తీవ్ర సంచలనంగా మారింది. చైనాలో కరోనా విజృంభణ కారణంగా రోజూ 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నా… ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి ఆగకుండా అనేక ఆంక్షలు విధించడంతో… ఎక్కడికక్కడ కార్మికులు తిరగబడుతున్నారు. రోజుల తరబడి క్వారంటైన్ కేంద్రాల్లో మగ్గిపోలేమంటూ, ఇళ్లకు పంపాలంటూ ఆందోళనలు చేస్తున్నారు.
ఐఫోన్ తయారీ సంస్థ అయిన ఫాక్స్కాన్ కార్మికులు కూడా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించడం, భద్రతా సిబ్బంది వారిని అడ్డుకోవడం ఘర్షణకు దారితీసింది. దానికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
జెంగ్ ఝౌలోని ఫాక్స్కాన్ ప్లాంట్లో దాదాపు రెండు లక్షల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో లక్ష మంది మానేయడంతో… కంపెనీ భారీ సంఖ్యలో కొత్త వారిని నియమించుకుంది. ఇప్పుడు కొత్త సిబ్బందే ఆందోళనకు దిగినట్లు సమాచారం. నెల కిందట ఉద్యోగంలో చేరిన తమను అసలు బయటకు అనుమతించడం లేదని… చేసిన పనికి డబ్బు కూడా ఇవ్వలేదని ఆరోపిస్తూ కార్మికులు వీడియోలు విడుదల చేశారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వసతిగృహాల నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చిన వేల మంది కార్మికులు… తప్పించుకొని పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది… కొందరు కార్మికులను కొట్టారు కూడా. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు బాష్పవాయువు కూడా ప్రయోగించినట్లు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటనలపై స్పందించిన ఫాక్స్కాన్ సంస్థ… క్షమాపణలు కోరింది. ఘటనపై తమ బృందం విచారణ జరుపుతోందని… కొత్త సిబ్బంది నియామక ప్రక్రియలో భాగంగా సాంకేతిక లోపాన్ని గుర్తించామని… ముందుగా చెప్పినట్లు కార్మికులకు జీతభత్యాలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది.
చైనాలో కొవిడ్ ఉద్ధృతి పెరుగుతున్నా… ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి కొనసాగించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం కంపెనీల్లోనే క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసి… కార్మికులు, సిబ్బందిని వాటిల్లోనే ఉంచుతోంది. వాళ్లు తప్పించుకోకుండా కొన్ని కంపెనీలు, ఫ్యాక్టరీల ప్రహరీలకు ఇనుప కంచెలు ఏర్పాటు చేయడమే కాకుండా… భారీగా సెక్యూరిటీ సిబ్బందిని కూడా మోహరించారు. దీన్ని నిరసిస్తూ అక్కడక్కడా కార్మికులు తిరగబడుతుండటం… అలజడి రేపుతోంది.