Elon Musk:చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు.. ట్విటర్ను కొని నిండా మునిగినా ఎలాన్ మస్క్(Elon Musk) ఇంకా మారినట్లు కనిపించడం లేదు. ట్విట్టర్(Twitter)ను 44 బిలియన్ అమెరికన్ డాలర్లకు కొన్న తర్వాత ఆయన కంపెనీ టెస్లా షేర్లు పతనం కావడంతో ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానాన్ని కోల్పోయాడు. అయినా సరే తగ్గేదేలే అంటున్నాడు మస్క్. ఇప్పటికే ట్విట్టర్లో రకరకాల మార్పులకు ప్రయత్నిస్తున్నాడు. ట్విట్టర్ ప్రక్షాళన చేస్తూనే అమెరికాకు చెందిన మరో కంపెనీని కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాడు.
ఈ సారి మస్క్ కన్ను కార్పొరేట్ మీడియా కంపెనీ సబ్స్టాక్పై పడింది. వాల్స్ట్రీట్ సిల్వర్ పేరుతో ఉన్న ఓ ట్విట్టర్ యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ కంపెనీని కొనుగోలు చేయడానికి రెడీ అని సంకేతాలిచ్చాడు మస్క్. సబ్స్టాక్ను కొని దాన్ని ట్విట్టర్తో కలపడం వల్ల మేలు జరుగుతుందా అన్నాడు వాల్స్ట్రీట్ సిల్వర్. అంతేకాదు.. ఈ రెండింటి కలయిక వల్ల కార్పొరేట్ మీడియాలో కాంపిటీషన్ పెరుగుతుందని కూడా సూచించాడు. దీనికి వెంటనే స్పందించిన మస్క్.. ఆ ఆలోచనకు తాను సిద్ధమే అంటూ ప్రకటించాడు. ఆ తర్వాత కార్పొరేట్ మీడియాపైనా వరుసగా ఎలాన్ మస్క్ ట్వీట్లు చేశాడు . గతంలో ట్విట్టర్ను కొనుగోలు చేయడానికి ముందు కూడా మస్క్ ఇదే తరహాలో ప్రవర్తించాడు.
సబ్స్టాక్ కంపెనీని 2017లో క్రిస్ బెస్ట్, జైరాజ్ సేథి, హమీష్ మెకంజీలు ప్రారంభించారు. సబ్స్క్రిప్షన్ న్యూస్లెటర్ల డిజైనింగ్, పబ్లిషింగ్, పేమెంట్, అనలిటిక్స్ సర్వీసులను అందిస్తుంది. యూఎస్లో ఈ సంస్థకు మంచి రెప్యుటేషన్ ఉంది. మస్క్ చేతిలో ఇప్పటికే ఆరు కంపెనీలున్నాయి. టెస్లా, స్పేస్ఎక్స్, ది బోరింగ్ కంపెనీ, న్యూరాలింక్, ఓపెన్ AI తో పాటు ట్విట్టర్ను ఇటీవలే కొనుగోలు చేశాడు. ఇప్పుడు సబ్స్టాక్ను కూడా కొనుగోలు చేస్తే ఏడో కంపెనీకి కూడా ఓనర్ అవుతాడు ఎలాన్ మస్క్.