Electric Bike : ఎలక్ట్రిక్ టూవీలర్ల మార్కెట్లోకి మరో కొత్త వాహనం రాబోతోంది. అయితే… మిగతా ఎలక్ట్రిక్ బైకులకు భిన్నంగా… కొత్త బండి గేర్లతో వస్తోంది. వచ్చే ఏడాది రోడ్డెక్కబోయే ఆ ఎలక్ట్రిక్ బైక్ ఫుల్ డీటెయిల్స్ చూద్దాం…
అహ్మదాబాద్కు చెందిన మ్యాటర్ ఎనర్జీ తన తొలి ఎలక్ట్రిక్ బైక్ను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. అద్భుతమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్స్తో… మ్యాటర్ పేరుతో ఎలక్ట్రిక్ బైక్ను ఆవిష్కరించింది. ఇందులో 5 కిలోవాట్ల లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే… 125 నుంచి 150 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని మ్యాటర్ ఎనర్జీ చెబుతోంది. స్టాండర్డ్, ఫాస్ట్ ఛార్జింగ్ రెండింటినీ మ్యాటర్ బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. స్టాండర్డ్ విధానంలో బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి 5 గంటల సమయం పడుతుందని కంపెనీ వెల్లడించింది. అయితే అన్ని ఎలక్ట్రిక్ టూ వీలర్ల మాదిరి కాకుండా… యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 4 గేర్లతో ఈ బైక్ రానుంది.
LED లైట్లు, స్ప్లిట్ సీట్లు, క్లిప్-ఆన్ హ్యాండిల్ బార్లు , స్ప్లిట్ రియర్ గ్రాబ్ రైల్తో స్పోర్టీ స్ట్రీట్ డిజైన్తో చూడగానే ఆకట్టుకుంటోంది… మ్యాటర్. ట్యాంక్ భాగంలో 5 లీటర్ గ్లోవ్బాక్స్ ఏర్పాటు చేశారు. ఇందులోనే ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. 7 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, నోటిఫికేషన్ అలర్ట్స్, మ్యూజిక్ ప్లేబ్యాక్ వంటి ఫీచర్లు మ్యాటర్లో ఉన్నాయి. ఇది ఓవర్-ది-ఎయిర్ అప్డేట్లను కూడా సపోర్ట్ చేస్తుంది. స్పోర్ట్, ఎకో, సిటీ మోడ్స్లో… గ్రే అండ్ నియాన్, బ్లూ అండ్ గోల్డ్, బ్లాక్ అండ్ గోల్డ్, రెడ్/బ్లాక్/వైట్ కలర్స్లో మ్యాటర్ అందుబాటులోకి రానుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య బుకింగ్స్ ప్రారంభించి… ఏప్రిల్ నుంచి బైక్ డెలివరీ చేసే అవకాశం ఉంది. ఇక ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించకపోయినా… ఎక్స్-షోరూమ్ ధరే రూ.1.75 లక్షలు ఉండొచ్చని అంచనా. ఇక ఇన్సూరెన్స్, ఎక్స్ ట్రా ఫిటింగ్స్ కలుపుకుంటే… మ్యాటర్ కోసం రూ.2 లక్షల దాకా ఖర్చు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు.