Mann Ki Baat 114th Episode: తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా, జరిగిన 114వ మన్ కీ బాత్ ఎపిసోడ్లో ప్రధాని మోదీ పలు అంశాలను ప్రస్తావించారు. ఇందులో భాగంగా తెలంగాణకు సంబంధించి రాష్ట్ర ప్రజలను పొగడ్తలతో ముంచెత్తారు. ప్రతి నెల చివరి ఆదివారం ఆల్ ఇండియా రేడియో కార్యక్రమంలో మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోాదీ మాట్లాడుతున్న విషయం తెలిసిందే.
తెలంగాణ ప్రజలను ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. అనుకున్న లక్ష్యం కంటే మొక్కలను అధిక సంఖ్యలో నాటారన్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రజలు సరికొత్త రికార్డు సాధించారని తెలిపారు. తెలంగాణతో పాటు ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు సైతం కొత్త రికార్డును నెలకొల్పినట్లు పేర్కొన్నారు. ఇదంతా ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా జరిగింది.
ఇదిలా ఉండగా, ఈ మన్ కీ బాత్ చాలా ప్రత్యేకమైంది. నేటితో మన్ కీ బాత్ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2014 అక్టోబర్ 3న దసరా పండుగ సమయంలో మన్ కీ బాత్ తొలి ఎపిసోడ్ ప్రారంభమైంది. ఈ మేరకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న వివిధ టీవీ ఛానళ్లు, ప్రాంతీయ టీవీ ఛానళ్లు, యూటూబర్స్ కి ధన్యవాదాలు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ జూన్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మొక్క నాటి తల్లి పేరు పెట్టాలని చెప్పారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని పలు రాష్ట్రాలు విజయవంతంగా అమలు చేశాయి. ఈ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా దాదాపు 80 కోట్ల మొక్కలు నాటడంతో తమ లక్ష్యాన్ని చేరుకున్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం మొక్కలు నాటేందుకు ఆసక్తి కనబర్చింది. కాగా, అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మొక్కలు నాటింది. దీంతో తెలంగాణలో గ్రీనరీ బాగా పెరిగింది.
Also Read: డిప్యూటీ సీఎంగా మరో స్టార్ హీరో.. నేడే ప్రమాణస్వీకారం
ఈ మేరకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కొత్తూరు నుర్వి రాజశేఖర్ మొక్కలు నాటుతూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు.