స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలామంది ఐఏఎస్లు అడ్డగోలుగా వేల కోట్లు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ధరణిలో అడ్డూ అదుపు లేకుండా కోట్ల విలువ చేసే భూముల మాటున దోచేశారు. ఈక్రమంలోనే కమీషన్ల రూపంలో భారీగా డబ్బులు పొగు చేసుకున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్కి నోటీసులు ఇచ్చింది. ఇన్నాళ్లూ ప్రభుత్వ పెద్దలకు, ఉన్నతాధికారులకు అన్యాయం చేశారని ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పడు ఈడీ ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు. అటు డబ్బులు ఇచ్చిన బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇటు బినామీల్లో ఏం జరుగుతుందోననే టెన్షన్ ఎక్కువైంది.
మాజీ మంత్రి మేనల్లుడి పాత్ర?
వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మేనల్లుడు తక్కళపల్లి రంగారావు మియాపూర్ ప్రాంతంలో ఉంటారు. అమోయ్ కుమార్ ఉండే ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల నుంచి మియాపూర్కి కియా కార్నివాల్ వాహనంలో కోట్లాది రూపాయలు చేరేవని విశ్వసనీయ సమాచారం. రంగారావు తన సొంత కుటంబ సభ్యులకు డబ్బులు చేరవేసి బినామీల రూపంలో భారీగా ఆస్తులు కూడగట్టినట్టు తెలుస్తోంది. ఈడీ నోటీసులతో కుటుంబాల్లో గొడవలు మొదలైనట్లు సమాచారం. ఇన్నాళ్లూ తమ పేరు బయటకు రాలేదు. ఇప్పుడు రోడ్డున పడాల్సి వస్తుందని వాపోతున్నరని టాక్. రంగారావు దగ్గరి బంధువు అయితే, నేరుగా భార్యకు విడాకులు ఇస్తాననని, తనకు అమోయ్ కుమార్కి ఎలాంటి సంబంధాలు లేవని తెగేసి చెప్పాడట.
శంకర్ హిల్స్ కేసులో అరెస్టులు ఉంటాయా?
వట్టినాగులపల్లిలో మొత్తం 33 సర్వే నెంబర్లలో 460 ఎకరాల్లో శంకర్ హిల్స్ ఉంటుంది. 3,328 ప్లాట్స్ 1983 నుంచి 1986 వరకు అమ్మకాలు జరిగాయి. కానీ, 2013లో కొంతమంది తమకు విక్రయించారని ప్లాట్స్ మీదకు వచ్చారు. ఇలా టైటిల్ వివాదంలో ఉన్న భూములకు అప్పటి రంగారెడ్డి కలెక్టర్ ఫినిక్స్, దాని అనుబంధ రియల్ ఎస్టేట్ సంస్థకు మేలు చేసేలా ప్రొహిబిటెడ్ లిస్ట్లో నుంచి తీసివేసి రాత్రికి రాత్రి ధరణిలో పేర్లు నమోదు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ప్లాట్ ఓనర్స్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ కేసులో జరిగిన అన్యాయానికి బాధ్యులు ఆనాటి కలెక్టర్ అని ప్రభుత్వ పెద్దలు గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అరెస్టులపై చర్చ జరుగుతోంది.
ఢిల్లీకి క్యూ కడుతున్న ఉన్నతాధికారులు
గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి, ఇప్పుడు కూడా కీ పోస్ట్లో ఉన్న ఓ ఉన్నతాధికారి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. అమోయ్ కుమార్కి నోటీసులు రాగానే వాటాలు పంచుకున్నారనే ఆరోపణలు ఉన్న అధికారులు, ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మాజీ సీఎస్ కూడా తన ప్రయత్నాలు తాను చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ కేసులో అమోయ్ కుమార్ ఒక్కరికే నోటీసులు, వివరణ ఉంటుందా? తలా పాపం తిలా పిడికెడు అన్నట్లు అందరకీ పంచి పెట్టారని ఉండటంతో వారందరి పాత్ర తేలుస్తారా అనేది అసక్తికరంగా మారింది. ఇదే క్రమంలో బినామీల బ్యాచ్ అంతా తెగ కంగారుపడుతున్నట్టు సమాచారం.