E-Bike : సాధారణంగా బైక్ పై ఇద్దరు మించి ప్రయాణించలేం. కానీ ఆ యువకుడు తయారు చేసిన ఎలక్ట్రిక్ బైక్ పై ఆరుగురు ప్రయాణించే వీలుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే చాలు 150 కిలోమీటర్లు మైలేజ్ వస్తుంది. ఈ సూపర్ ఈ-బైక్ ను ఉత్తర్ప్రదేశ్లోని ఆజంగఢ్ జిల్లా లోహ్రా గ్రామానికి చెందిన అష్షద్ అబ్దుల్లా అనే యువకుడు రూపొందించాడు. ఆరుగురు ప్రయాణించేలా ఎలక్ట్రిక్ బైక్ తయారుచేసి హౌరౌ అనిపించాడు.
అష్షద్ అబ్దుల్లా ఐటీఐ పూర్తి చేశాడు. ప్రస్తుతం బీసీఏ చదువుతున్నాడు. తనకు వచ్చిన చిన్న ఆలోచనతో ఎలక్ట్రిక్ బైక్ తయారీకి సంకల్పించాడు. ఎంతో శ్రమించి తక్కువ ఖర్చుతోనే కొత్త ఈ- బైక్ ను ఆవిష్కరించాడు.
అష్షద్ బైక్ తయారీ కోసం ఎంతో శ్రమించాడు. గూగుల్, యూట్యూబ్ల ద్వారా విద్యుత్తు వాహనాల గురించి సమాచారం తెలుసుకున్నాడు. ఆ తర్వాత నెల రోజులు కష్టపడి తన లక్ష్యాన్ని సాధించాడు. ఈ- బైక్తో పర్యావరణానికి హాని ఉండదు. అతితక్కువ ఖర్చుతో బైక్ నడుపుకోవచ్చు. ఈ- బైక్ పై ఎక్కువ మంది ప్రయాణించడానికి వీలుంది. ఒక్కసారి బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు.
ఈ- బైక్ గురించి తెలుసుకున్న వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర .. అబ్దుల్లా ప్రతిభను ప్రశంసిస్తూ ట్వీట్ కూడా చేశారు. పెట్రోల్ ధర రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ- బైక్ ను రూపొందించానని అబ్దుల్లా తెలిపాడు. పాత సామానును ఉపయోగించుకొని కేవలం రూ.10-12 వేల ఖర్చుతో ఎలక్ట్రిక్ బైక్ను తయారు చేశానని వివరించాడు.