Drunk Man Urinates On Woman: న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో ఓ దారుణం జరిగింది. గత నవంబర్ 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటికొచ్చింది. బిజినెస్ క్లాస్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి… మద్యం మత్తులో ఓ వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. మహిళ పట్ల నిందితుడు అంత దారుణంగా ప్రవర్తించినా… విమానం ఢిల్లీలో ల్యాండయ్యాక అతణ్ని కులాసాగా పంపించేశారు… సిబ్బంది, విమానాశ్రయం అధికారులు. దాంతో ఆ మహిళ టాటా గ్రూప్ చైర్మెన్ చంద్రశేఖరన్కు లేఖ రాశారు. దానిపై విచారణ జరిపిన సంస్థ… ఇకపై అతణ్ని ఎయిరిండియా విమానాల్లో అనుమతించకూడదని నిర్ణయం తీసుకుంది. అంతేకాదు… నిందితుడు ఏ విమానంలోనూ ప్రయాణించకుండా… నో-ఫ్లై లిస్టులో చేర్చాలని ప్రభుత్వ కమిటీకి సిఫార్సు చేసింది. దీనిపై ప్రభుత్వ కమిటీ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో… మధ్యాహ్న భోజనం తర్వాత లైట్లు ఆర్పివేసిన సమయంలో… నిందితుడు మద్యం మత్తులో తన జిప్ తీసి మహిళపై మూత్ర విసర్జన చేశాడు. ఆ తర్వాత మరో ప్రయాణికుడు వెళ్లిపోమని చెప్పేదాకా.. అతను అక్కడే నిలబడి ఉన్నాడు. బాధిత మహిళ తన బట్టలు, బూట్లు, బ్యాగ్ మూత్రంలో తడిసిపోయాయని… విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోని సిబ్బంది తనను మళ్లీ అదే సీటుకు వెళ్లాలని చెప్పారని ఆమె ఆరోపించారు. దాంతో తాను మూత్రంతో తడిసిన ఆ సీటుకు వెళ్లడం ఇష్టం లేదని చెప్పడంతో… సిబ్బందికి చెందిన ఓ సీటు కేటాయించారు. అయితే మరో గంట తర్వాత మూత్రంతో తడిసిన సీట్లో బెడ్ షీట్స్ వేసి… తనను తిరిగి అక్కడికే వెళ్లమని చెప్పారని మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో… సిబ్బంది ఆమెకు మరో సీటు కేటాయించారు. చాలా బిజినెస్ క్లాస్ సీట్లు ఖాళీగా ఉన్నా… తనకు మరో క్యాబిన్ సీటు ఇవ్వలేదని మహిళ ఆరోపించింది. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్… ఎయిరిండియా నుంచి నివేదికను కోరింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పింది.