Padmasanam : నూరేళ్లు ఆరోగ్యంతో జీవించాలంటే వ్యాయామాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో యోగా అతి ముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా యోగాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎన్నో మొండి వ్యాధులను యోగా నయం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. కేవలం శరీరంపైనే కాదు మెదడు, ఆత్మను వృద్ధి చేయడంలో దీని పాత్ర ముఖ్యమైనది. ప్రతిరోజూ యోగా చేయడం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థను మెరుగుపర్చుకోవచ్చు. అంతేకాకుండా వృద్ధాప్యంలో వచ్చే బోలు ఎముకల వ్యాధి, కీళ్ల నొప్పుల నుంచి మనల్ని కాపాడుకోవచ్చు. నిత్యం యోగా చేయడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి. అధికంగా తినే అలవాటును మానుకోవచ్చు. నిద్రలేమి సమస్యలను దూరం చేస్తుంది. దీనితో పాటు రక్తపోటును అదుపులో ఉంచుతుంది. మతిమరుపు ఉండదు. జీవక్రియను మెరుగుపడేలా చేస్తుంది, మన గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. టైప్ 2 డయాబెటీస్ను యోగా ప్రభావవంతంగా ఎదుర్కొంటుంది. మలబద్దకం సమస్య నుంచి విముక్తి కల్పిస్తుంది. ఈ యోగాలో అతిముఖ్యమైనది పద్మాసనం. పద్మం ఆకారంలో ఉండే ఈ ఆసనం నిత్యం వేయడం వల్ల పనిపై మనసు లగ్నం చేయొచ్చు. మోకాలి కీళ్లను బలోపేతం చేయడానికి ఇది చాలాబాగా ఉపయోగపడుతుంది. మోకాళ్ల నొప్పులు ఉంటే రోజూ 10 నిమిషాలు పద్మాసనం చేయడం మంచిది. మోకాలి క్షీణత తగ్గడంతో పాటు ఆర్థరైటిస్ నివారణకు ఉపయోగపడుతుంది. ఒత్తిడి, ఆందోళన, పద్మాసనం వేయడం ద్వారా దూరం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆసనం వేస్తే రోజంతా ఎనర్జిటిక్గా ఉంచుతుంది. శారీరక, మానసిక అలసట తొలగుతుంది. నిద్రలేమితో బాధపడుతున్నవారు ఈ పద్మాసనాన్ని తప్పనిసరిగా చేయాలి. అజీర్తి, ఎసిడిటి, గ్యాస్, మలబద్ధకం ఉంటే పోగొడుతుంది. పేగుల కదలికలను పద్మాసనం క్రమబద్ధీకరిస్తుంది.