Diwali : వెలుగుతో పాటు సందడిని మోసుకొచ్చేది దీపావళి పండుగ. పిన్నలు, పెద్దలు అందరిలోనూ సందడే. దివ్వెల దీపావళితో ప్రమోదమే కాదు.. ప్రమాదమూ పొంచి ఉంటుంది. అందుకే ఎంతో జాగరూకత అవసరం. ఇక ఈ పండుగను పర్యావరణ హితంగా మార్చేందుకు కర్ణాటకకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న వినూత్న ప్రయత్నిమిది.
పండుగ రోజు మన ఇంటికి కాంతిని, అందాన్ని తెచ్చేవి ప్రమిదలు. వాడి పారేయకుండా ఆ దివ్వెలను ఎరువుగా వాడుకునే ఆలోచన చేసింది ప్రగతి ప్రతిష్టాన్. మైసూరుకు చెందిన ఆ సంస్థ ఆవుపేడ, మూత్రం, నెయ్యి, పెరుగును ఉపయోగించి ఎకో-ఫ్రెండ్లీ దివ్వెలను తయారు చేస్తోంది.
మైసూరు విద్యారణ్యపురానికి చెందిన బీకే అజయ కుమార్ జైన్ సారథ్యంలోని ఆ సంస్థ ఇప్పటికే 3 వేల ప్రమిదలను సిద్ధం చేసింది. పండుగలోగా మరో 2 వేల దివ్వెలను తయారు చేస్తామని జైన్ చెప్పారు. అక్కడి దేవరాజ్ మార్కెట్ వద్ద వీటిని ఉచితంగా పంపిణీ చేయడం మరో విశేషం. పదేళ్ల క్రితం ప్రగతి ప్రతిష్ఠాన్ సంస్థను నెలకొల్పారు జైన్. అప్పటి నుంచి ఇలా పర్యావరణహితమైన ప్రమిదలను తయారు చేసి అందరికీ అందిస్తున్నారు.
దీపావళి పండుగకు ఆరు నెలల ముందునుంచే ఈ సంస్థ వాలంటీర్లు ఆవు పేడను సేకరిస్తారు. మైసూరు పింజ్రపోల్ సొసైటీ గోశాల నిర్వాహకులు దీనిని ఉచితంగా అందజేస్తారు. ఇక పండుగకు పదిరోజుల ముందు నుంచి ప్రమిదల తయారీ కార్యక్రమం ఆరంభమవుతుంది.
స్కౌట్స్ అండ్ గైడ్స్ సహా వివిధ స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లకు వీటిని తయారు చేయడంలో శిక్షణ ఇస్తారు.
ఎకో-ఫ్రెండ్లీ దివ్వెలను రెండు సార్లు వాడిన తర్వాత బూడిదగా మారిపోతుంది. దీనిని ఎరువుగా మొక్కలకు వాడుకోవచ్చు. సంప్రదాయ మట్టిప్రమిదల స్థానాన్ని విద్యుత్తు బల్బులు ఆక్రమించేశాయి. విద్యుత్తు వాడకమంటే పర్యావరణంపై భారం మోపినట్టే. అందుకే ఈ ఎకో-ఫ్రెండ్లీ దివ్వెల వినియోగాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్టు జైన్ వెల్లడించారు.