Dharmapuri Temple :- ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పవర్ ఫుల్. ధర్మపురిని దర్శిస్తే యమపురి కలగదని నమ్మకం ఏనాటి నుంచో ఉంది. కాలంతో సంబంధం లేకుండా ప్రతీ రోజూ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు స్వామిని దర్శించుకుంటూ ఉంటారు.త్రిమూర్తులు కొలువైనప్పటికీ ధర్మపురి నరసింహ క్షేత్రంగానే ఖ్యాతికెక్కింది. గోదారిలో మూడు మునకలు వేసి స్వామి దర్శనం చేసుకుంటే చాలు మూడు జన్మల పాపాలు హరించుకుపోతాయని విశ్వాసం బలంగా నాటుకుపోయింది. వార్షిక బ్రహ్మోత్సవాల సమయాల్లో ఆలయానికి అశేష సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.
తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలోని పేరొందిన పుణ్య క్షేత్రాల్లో నవనారసింహా క్షేత్రాల్లో ఒకటి ధర్మపురి. ధర్మవర్మ అనే మహారాజు పాలన వల్లే ఈ క్షేత్రం ధర్మపురిగా ప్రసిద్దికెక్కింది. క్రీస్తుశకంకంటే ముందు నిర్మితమైన ఆలయాన్ని బహుమనీ సుల్తానుల దండ యాత్రలో ధ్వంసం చేశారు. 17వ శతాబ్దంలో ఈ గుడిని మళ్లీ పునరుద్దరించినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది.ఆలయంలో ప్రధాన మూర్తి అయిన లక్ష్మీనర సింహాస్వామి సాలగ్రామ శిలగా వెలిశారు.
అఖండగోదావరి నది ఆనుకున్న ఊరు కావడంతో… దక్షిణకాశీగా పిలువబడుతోంది. స్వామివారి ఆలయ ప్రాంగణంలో యమధర్మ రాజు ఆలయం ఉంది. ఇలాంటి ఆలయం దేశంలో మరెక్కడా లేదు.లక్ష్మినరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు యమధర్మరాజును కూడా దర్శించుకుని వెళ్తుంటారు. ప్రాచీన సంస్కృతికి, సంగీతానికి, సాహిత్యానికి కేరాఫ్ అడ్రస్ అయింది.ప్రతీ ఏటా పాల్గుణ మాసంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు 13రోజులపాటు నిర్వహిస్తుంటారు. ఏకాదశి నుంచి ఉత్సవాలు మొదలవుతాయి.ఈ బ్రహ్మోత్స వాలను కనులారా చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు.వైశాఖ మాసంలో నరసింహ నవరాత్రోత్సవాలు, హనుమాన్ జయంతి ఉత్సవాలు ఈ క్షేత్రంలో ఘనంగా నిర్వహిస్తుంటారు.