Dhanurmasam Muggulu:ధనుర్మాసం మొదలవగానే ప్రతీ ఇంటి ముందు రకరకాల రంగవల్లికలు అదే ముగ్గులు ముచ్చటగా కనిపిస్తుంటాయి. ఉదయాన్నే మహిళలు గుమ్మం ముందు శుభ్రంగా తుడిచి ముగ్గులు వేస్తుంటారు సంక్రాంతి వరకు తెలుగు లోగిళ్లు రంగుల రంగుల ముగ్గులతో కళకళలాతుంటాయి . ముగ్గులని గుల్ల ముగ్గుతోనూ, బియ్యపు పిండితోనూ, రెండు కలిపిన మిశ్రమంతోను వేస్తుంటారు. పూలు మరియు గొబ్బెమ్మలతో అలంకరించుకోవాలంటూ పండితులు చెబుతున్నారు.మామూలుగా అయితే సంక్రాంతికి మాత్రమే గొబ్బెమ్మలను పెడతారని అంతా అనుకుంటూ ఉంటారు.కాని ధనుర్మాసం మొత్తం కూడా గొబ్బెమ్మలు పెట్టడం వల్ల అన్ని విధాలుగా మంచిదని అంటున్నారు.
ఏ ఇంటి ముందు ధనుర్మాసంలో కళ్లాపి చల్లి ముగ్గు పెట్టి ఉంటుందో ఆ ఇంటికి రావడానికే లక్ష్మీదేవి ఇష్టపడుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే ఉదయాన్నే వాకిలి శుభ్రంగా ఊడ్చి ఆవుపేడతో కళ్లాపి చల్లి బియ్యపు పిండితో ముగ్గు పెడుతుంటారు. నిత్యం ముగ్గులు వేయడం వల్ల స్త్రీలకు మంచి వ్యాయామం కూడా కలుగుతుంది. పితృకార్యం నిర్వహణ పూర్తి అయిన తరువాత, వెంటనే వాకిట్లో నీళ్లు చల్లి ముగ్గుపెట్టాలని చెబుతుంటారు.ముగ్గు ఇంటికి అందాన్ని తీసుకురావడమే కాదు, ఇంటికి రక్షణని కూడా ఇస్తుందని గ్రహించాలి. ఇంకా ధనుర్మాసంలో ఇంటి ముందు ముగ్గే ఆ గృహానికి రక్షణ అని పండితులు అంటున్నారు.దుష్టశక్తులు ముగ్గులు దాటి లోపలకి ప్రవేశించవని నమ్మకం.
రకరకాలైన సూక్ష్మ జీవులు, దోమలుమొదలైన పురుగులు రాత్రి ఎక్కడో అక్కడ తల దాచుకుని, తెల్లవారు జామున ఆశ్రయం కోసం వెదుకుతూ వస్తాయి. వాటిని రానీయకుండా ఉండాలంటే ఆవు పేడతో కళ్ళాపి చల్లి, ముగ్గు వేయాలి. ఆవు పేడకి క్రిమి సంహారక గుణం ఉంది. ఈ కారణం చేతనే ప్రతి శుభ కార్యంలోను ముందు ఆవు పేడతో అలికి ముగ్గు వేయడం సంప్రదాయంగా వస్తోంది. దాంతో అంతకు ముందున్న క్రిములు పోవటమే కాకుండా పది మంది రావటం వల్ల వచ్చే కాలుష్యాన్ని నివారించవచ్చు..